ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వల్లే రాష్ట్రంలో వర్షాలు పడటం లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నంద్యాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు పడకపోవడానికి పాలకుల మనస్తత్వమే కారణమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఏలుకునే రాజు మనస్తత్వం బాగుంటేనే సకాలంలో వర్షాలు వస్తాయి.. కానీ ప్రస్తుతం ఉన్న రాజు (చంద్రబాబు) తీరు వల్లే ప్రకృతి కూడా రాష్ట్రానికి సహకరించడం లేదు” అని బుగ్గన వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ రాష్ట్రంలో కరవు పరిస్థితులు తాండవిస్తాయన్న పాత విమర్శలను గుర్తు చేస్తూ బుగ్గన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు నాయుడు ప్రజలకు అసాధ్యమైన హామీలు ఇచ్చి ఆశ పెట్టారని, అలాంటి ఆశలు కల్పించడంలో ఆయన దిట్ట అని బుగ్గన ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ప్రజల్లో ఉన్న ఆశ ముందు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మంచికి సంబంధించిన ‘కృతజ్ఞత’ ఓడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనలో జగన్ తాము చేసిన మంచి పనులను, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, కేవలం వాటిని చూసే ఓట్లు అడిగారని గుర్తుచేశారు. కానీ చంద్రబాబు మాత్రం అడ్డగోలు హామీలతో ప్రజలను భ్రమల్లో ముంచెత్తారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వర్షాలు కూడా పడకుండా ప్రకృతి సైతం ముఖం చాటేసిందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు.
