Jaahnavi Kandula : అమెరికాలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థిని 23 ఏళ్ల జాహ్నవి కందుల గతేడాది జనవరి 23న సియాటెల్లో ఓ ప్రమాదంలో చనిపోయింది. ఆమె మరణానికి కారణమైన సియాటెల్ పోలీసు అధికారి కెవిన్ డేవ్ నేర అభియోగాలను ఎదుర్కోబోరని అధికారులు ఇటీవల వెల్లడించారు. తగిన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. 2023 జనవరి 23న సియాటెల్లో రోడ్డు దాటుతున్న జాహ్నవిని కెవిన్ డేవ్ నడుపుతున్న పోలీసు గస్తీ వాహనం గంటకు 119 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి ఢీకొట్టింది. దీంతో జాహ్నవి (Jaahnavi Kandula) 100 అడుగుల దూరం ఎగిరిపడి అక్కడికక్కడే జాహ్నవి చనిపోయింది.
We’re now on WhatsApp. Click to Join
ఈ దారుణ ఘటనపై దాదాపు ఏడాది తర్వాత భారత ప్రభుత్వం ఆలస్యంగా స్పందించడం మొదలుపెట్టింది. జాహ్నవి రోడ్డు ప్రమాద కేసులో నిందితుడిగా ఉన్న సియాటెల్ పోలీసు అధికారిపై నేరారోపణలను ఎత్తివేస్తూ అమెరికాలోని ఓ కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని భారత ప్రభుత్వం కోరింది. జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చేసేందుకు కృషి చేస్తున్నామని, సియాటెల్ పోలీసుల విచారణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వేచి చూస్తామని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
జాహ్నవి మరణంపై అమెరికాలోని కింగ్ కౌంటీ ప్రాసిక్యూషన్ అటార్నీ ఇటీవల విడుదల చేసిన దర్యాప్తు నివేదికపై.. బాధిత కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. తగిన పరిష్కారం కోసం సియాటెల్ పోలీసులు సహా స్థానిక అధికారుల వద్ద ఈ విషయాన్ని లేవనెత్తుతామని భారత రాయబార కార్యాలయం చెప్పింది. ఈ కేసు నివేదికను సమీక్ష కోసం సియాటెల్ సిటీ అటార్నీ కార్యాలయానికి పంపించినట్లు తెలిపింది.