కుప్పం అభివృద్ధిని రాష్ట్ర ప్రగతికి ఆదర్శంగా నిలబెట్టే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మూడు రోజులుగా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమ కార్యక్రమాలపై పలు అంశాలను వెల్లడించారు. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు జరిగినా ప్రభుత్వం తన లక్ష్యాల నుంచి వెనక్కి తగ్గబోదని స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ శక్తులు ప్రత్యేకంగా నిధులు సమకూర్చి ప్రభుత్వం, తనతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు. హింస, అసత్య ప్రచారం, ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. అయితే అలాంటి ప్రచారాలతో రాష్ట్ర అభివృద్ధి ఆగదని, ప్రజల సహకారంతో ముందుకు సాగుతామని చెప్పారు.
కుప్పం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని సీఎం తెలిపారు. రహదారులు, కమ్యూనికేషన్, మౌలిక సదుపాయాల విస్తరణతో కుప్పానికి అన్ని రంగాల్లో మెరుగైన అనుసంధానం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న కొత్త కుప్పాన్ని ప్రజలు చూస్తారని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని సమానంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ సంకల్పమని, వికేంద్రీకృత అభివృద్ధి విధానంతో అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. పారిశ్రామిక రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చంద్రబాబు వెల్లడించారు. క్వాంటమ్ టెక్నాలజీ, సెమీకండక్టర్ రంగాల్లో పెట్టుబడులు తీసుకురావడానికి చర్యలు చేపట్టామని, వచ్చే డిసెంబరు నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇంధన రంగంలో సౌర, పవన విద్యుత్తో పాటు ఆధునిక విద్యుత్ సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రముఖ స్టీల్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం ఆంధ్రప్రదేశ్పై పరిశ్రమల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ, పచ్చదనానికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు.
ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం తెలిపారు. గతంలో భూముల కేటాయింపుల్లో జరిగిన వివాదాల కారణంగా పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, ఇప్పుడు పారదర్శక విధానాలతో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు రాష్ట్రాన్ని వీడే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపిస్తూ, ప్రస్తుతం ప్రతి ప్రాజెక్టును వేగంగా అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. హంద్రీ–నీవా కాలువ ద్వారా ఇప్పటికే కుప్పం వరకు కృష్ణా జలాలను తీసుకొచ్చామని, త్వరలో గాలేరు–నగరి ప్రాజెక్టును కూడా పూర్తి చేసి ప్రాంతానికి శాశ్వత సాగునీటి భద్రత కల్పిస్తామని చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి అనే ద్వంద్వ లక్ష్యాలతో ముందుకు సాగుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
