మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నానిపై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు వారిని బెదిరించారని, ఓ అధికారిని బాడీ షేమింగ్ చేస్తూ దూషించారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే… గురువారం మచిలీపట్నంలోని కొబ్బరితోట ప్రాంతంలో మున్సిపల్ అధికారులు చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై స్పందించిన పేర్ని నాని, అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా, చిలకలపూడి సీఐ పరమేశ్వరరావును ఉద్దేశించి బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేస్తూ అవమానించారని ఆరోపణలు వచ్చాయి.
పోలీసుల పట్ల పేర్ని నాని వ్యవహరించిన తీరుపై కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విధి నిర్వహణలో ఉన్న అధికారులను బెదిరించడం, వ్యక్తిగతంగా దూషించడం సరికాదని పేర్కొంటూ చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తమ ప్రభుత్వం వచ్చాక ఎవ్వరినీ వదిలిపెట్టమని, అంతు చూస్తామని నాని హెచ్చరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పేర్ని నానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
