గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఇద్దరు ఆగంతకులు హల్ చల్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున వీరు చేసిన పనికి ఊరిజనం అవాక్కయ్యారు. పొద్దున్నే లేచి ఇంటి ముందు చూసిన వారికి మైండ్ బ్లాంక్ అయ్యింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు దీనికి కారణమని గుర్తించారు. వారిని కనిపెట్టే పనిలో ఉన్నారు.
రోజురోజుకూ దొంగలు అప్డేట్ అవుతున్నారు. చోరీలు చేసే స్టైల్ మారుస్తున్నారు. ఈ సంగతి వార్తలు ఫాలో అయ్యేవారికి ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే దొంగల గురించి మాత్రం కాస్త తక్కువగానే విని ఉండొచ్చు. ఎందుకంటే ఈ దొంగలు చోరీ చేసే శైలే కాదు.. చోరీ చేయాలనుకునే టార్గెట్ కూడా డిఫరెంట్ కావున.. ఎవరైనా దొంగతనం చేయాలనుకుంటే.. బాగా డబ్బులు, బంగారం ఉన్న ఇంటికో.. లేదా తాళాలు వేసి ఉన్న ఇళ్లనో టార్గెట్ చేస్తుంటారు. ఇక రోడ్డుపై నడిచి వెళ్లేవారిని లక్ష్యంగా చేసుకునే చైన్ స్నాచర్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక బ్యాంకులు, నగల షాపులకు కన్నాలు వేసే బ్యా్చ్ ఇంకో రకం.కానీ గుంటూరు జిల్లా తాడేపల్లిలో మాత్రం వెరైటీ దొంగలు కలకలం రేపారు.
గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలంలో ఉన్న ఉండవల్లిలో శుక్రవారం కలకలం రేగింది. ఉండవల్లి గ్రామంలో ఇళ్ల బయట పార్కింగ్ చేసి ఉన్న స్కూటీలలో చోరీ జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు.. సుమారు 20 స్కూటీల డిక్కీలను దొంగతనంగా తెరిచారు. స్కూటర్ డిక్కీలలో ఏం దొరుకుతుందని ప్లాన్ చేశారో తెలియదు కానీ.. ఒకటీ రెండు కాదు ఏకంగా 20 స్కూటీల డిక్కీలను తెరిచారు. ఒక స్కూటర్ డిక్కీలో ఉన్న నాలుగు వేల రూపాయల నగదును కాజేశారు. అయితే 20 స్కూటీల డిక్కీలను దొంగతనంగా తెరిచిన దొంగలు.. అందులో ఏమీలేదని గుర్తించిన తర్వాత వాటిని యథాతథంగా పెట్టేశారా అంటే అదీ లేదు.
అన్ని డిక్కీలనూ అలాగే తెరిచి ఉంచి అక్కడి నుంచి ఉడాయించారు. తెల్లారిన తర్వాత ఇంటి బయటకు వచ్చి చూసిన యజమానులు.. ఈ సంగతిని గుర్తించి విస్తుపోయారు. ఆందోళనతో తాడేపల్లి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఫుటేజీలో ఇద్దరు వ్యక్తులు శుక్రవారం తెల్లవారుజామున స్కూటీలు తెరుస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి.
ఈ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు.. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని చెప్తున్నారు. అయితే ఏకంగా 20 స్కూటర్ల డిక్కీలను ఓపెన్ చేసి.. 4 వేలు ఎత్తుకెళ్లటం చర్చనీయాంశమైంది. స్కూటర్ డిక్కీలలో ఏం ఉంటాయనే ఆశతో ఆగంతకులు చోరీకి పాల్పడ్డారంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.
