ఏపీలో రాజ్యసభ ఎంపీ పదవుల సందడి నెల ముందే మొదలైంది. వచ్చే నెలలో 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో తమ పేరు పరిశీలించాలంటూ వినతులు మొదలయ్యాయి. టీడీపీలో భారీగా ఆశావహులు ఉన్నారు. మిత్రపక్షాలకు ఎన్ని ఇస్తారన్నదానిపైనే టీడీపీ నేతలకు కేటాయింపు ఉంటుందని చెబుతున్నారు. టీడీపీ నుంచి రేసులో ఏకంగా 8 మంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎంపీ పదవుల సందడి ముందే మొదలవుతోంది. వచ్చే నెలలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండగా.. ఆశావహులు పదవి కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమ పేరు పరిశీలించాలంటూ ముందుగానే రిక్వెస్ట్లు వస్తున్నాయని తెలుస్తోంది. వచ్చే నెలలో వైఎస్సార్సీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన పిల్లి సుభాష్చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్ల పదవీ కాలం ముగుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల బలాబలాలను బట్టి నాలుగు స్థానాలు ఆ కూటమికి దక్కుతాయి. ఈ నాలుగు ఎంపీల్లో రెండు టీడీపీ తీసుకుంటుందని.. జనసేన, బీజేపీలకు చెరొకటి ఇస్తారని టాక్ వినిపిస్తోంది.. ఎవరికి ఎన్నెన్ని పదవులు కేటాయించాలనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.
ఏపీ నుంచి వచ్చే నెలలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సభ్యుల పదవుల కోసం ముందుగానే పోటీ మొదలైంది. గత ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కనివారితో పాటు పార్టీల్లోని సీనియర్ నేతలు కూడా ఆశలు పెట్టుకుంటున్నారు. నాలుగు రాజ్యసభ ఎంపీ పదవుల పంపకాలపై స్పష్టత వచ్చిన తర్వాతే ఏ పార్టీకి ఎన్ని పదవులు కేటాయిస్తారో స్పష్టత వస్తుందంటున్నారు. టీడీపీ సామాజిక సమీకరణాలతో పాటు ప్రాంతాలను కూడా పరిగణనలోకి తీసుకుని రాజ్యసభ అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని భావిస్తోంది. కానీ టీడీపీలో ఆశావహులు ముందుగానే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నాలుగు రాజ్యసభ స్థానాల్లో టీడీపీకి రెండు, జనసేనకు ఒకటి, బీజేపీకి ఒకటి దక్కితే రెండు స్థానాల్లో ఒకటి ఎస్సీకి, ఒకటి బీసీకి దక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
టీడీపీలో ఆశావహుల విషయానికి వస్తే.. ప్రస్తుత రాజ్యసభ ఎంపీ సానా సతీష్ తనకు మరోసారి అవకాశమివ్వాలని కోరుతున్నారు. వీరితో పాటుగా కంభంపాటి రామ్మోహనరావు, గల్లా జయదేవ్, టీడీ జనార్దన్, భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణల పేర్లు తెరపైకి వచ్చాయి. టీడీపీ అధిష్టానం ఎస్సీ సామాజిక వర్గం నుంచి అవకాశం ఇవ్వాలనుకుంటే వర్ల రామయ్య ఎప్పటి నుంచో తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. 2019కి ముందు ఆయనకు రాజ్యసభ అవకాశం వచ్చినా చివరి నిమిషంలో ఆగిపోయింది.
అయితే వర్ల రామయ్య కుమారుడు కుమార్రాజా ప్రస్తుతం పామర్రు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు ఒకే కుటుంబంలో రెండు పదవులు సాధ్యమేనా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.
ఒకవేళ టీడీపీ ముస్లింలకు అవకాశం కల్పిస్తే, మాజీ శాసనమండలి ఛైర్మన్, ఏపీ ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎంఎ షరీఫ్ రేసులో ఉన్నారు. టీడీపీ బీసీ, యువత కోటాలో తన పేరును పరిశీలించాలని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ కూడా అడుగుతున్నారు. కానీ అయ్యన్న స్పీకర్గా ఉండటంతో విజయ్కు అవకాశం వస్తుందో లేదో చూడాలి. మరోవైపు గుంటూరు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ కూడా తనకు రాజ్యసభ పదవి కావాలని అడుగుతున్నారు. ఒకవేళ జనసేన పార్టీకి రాజ్యసభ పదవి కేటాయిస్తే, అది ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్కు ఇచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. బీజేపీకి పదవి ఇస్తే తమిళనాడు పార్టీ మాజీ అధ్యక్షుడు అన్నామలైకు అవకాశం ఇస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఏపీ నుంచి బీజేపీకి ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి మూడో పదవి ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ బీజేపీకి పదవి ఇవ్వకపోతే టీడీపీకి మూడు దక్కుతాయా, జనసేనతో కలిసి చెరో రెండు తీసుకుంటారా అన్నది చూడాలి. మొత్తం మీద ఏపీలో రాజ్యసభ ఎంపీ పదవుల సందడి ముందుగానే మొదలైంది.
