Kodali Nani కూటమి ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. వైఎస్ జగన్ విలువ ఏపీ ప్రజలకు తెలుస్తుందని.. 2029లో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. కూటమి సహా ఎవరూ దీన్ని ఆపలేరన్నారు. 2014 ఎన్నికల సమయంలో కూడా వైఎస్ జగన్ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వలేమని చెప్పిన విషయాన్ని కొడాలి నాని గుర్తు చేశారు.
2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విలువ ఏంటో తెలిసిందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. జగన్ను అనవసరంగా వదులుకున్నామని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని.. ఆయన ఉంటేనే తమకు మంచి జరుగుతుందని పేద వర్గాలు భావిస్తున్నాయని చెప్పుకొచ్చారు. 2029 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునే సత్తా కూటమికి లేదని.. వైఎస్ జగన్ను ఎదుర్కోవడానికి చెల్లెళ్లను రోడ్డుపైకి తీసుకొచ్చి అనవసరమైన నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి చనిపోతే ఆస్తిలో వాటాలు ఇచ్చేవారిని ఇప్పటి వరకు చూశామని.. కానీ తన సొంత ఆస్తిలో కూడా వాటాలు ఇచ్చిన వ్యక్తి వైఎస్ జగన్ అంటూ ప్రశంసించారు. జగన్ తన చెల్లెళ్ల గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని.. కానీ వారు మాత్రం జగన్ గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో దేవుడు కూటమి ప్రభుత్వానికి మొట్టికాయలు వేశాడని.. కూటమి నేతల పరువు పోయిందని నాని అన్నారు. కానీ ఆ దేవుడి దయ, ప్రజల సహకారంతో వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని.. కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చారని.. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ ఎన్నికల హామీలు కాకపోయినా, మేనిఫెస్టోలో లేకపోయినా అమలు చేశారన్నారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తామంటూ.. 2014 ఎన్నికల్లో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాయ మాటలు చెప్పారన్నారు.
2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని.. తాను, పేర్ని నాని మనం కూడా రుణాలు మాఫీ చేద్దామని జగన్ను కోరామని కొడాలి నాని అన్నారు. కానీ తమ మాట వినలేదని.. చంద్రబాబు చెప్పే హామీలు నెరవేర్చాలంటే ఏకంగా రూ.1.25 లక్షల కోట్లు కావాలని వైఎస్ జగన్ తమతో చెప్పారని.. ఆ హామీలు అమలు చేయడం కుదరదని అప్పుడే తేల్చి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రూ.1.25 లక్షల కోట్లతో రుణాలు మాఫీ చేసేంత ఆదాయం ఎక్కడ ఉందని ఆ రోజే జగన్ తమను ప్రశ్నించారన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇస్తే, మోదీ తాను చూసుకుంటానని చెప్పారు, పవన్ కళ్యాణ్ తాను ప్రశ్నిస్తాను అన్నారు.. జనాలు కూడా నమ్మి ఓటు వేశారన్నారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, డ్వాక్రా మహిళల్ని మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు మాత్రం ఐదేళ్లు అధికారాన్ని అనుభవించారని.. 2019 ఎన్నికల్లో ఆయన చేసిన మోసాన్ని తెలుసుకుని వైఎస్ జగన్కు ఓటేశారని మాజీ మంత్రి నాని అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన వ్యక్తి వైఎస్ జగన్ అంటూ కొడాలి నాని ప్రశంసించారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా వైఎస్ జగన్ పేద ప్రజలకు అండగా నిలబడ్డారన్నారు. 2024లో జగన్ను ఓడించడానికి దొంగలంతా కలిశారని.. జగన్ కంటే ఎక్కువ హామీలు అంటూ సూపర్ సిక్స్ పేరు చెప్పి కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. జగన్ చేసిన కార్యక్రమాల వల్ల జనాలు 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఓడించారని ప్రచారం చేస్తున్నారని.. కానీ చంద్రబాబు ఇచ్చిన దొంగ హామీల వల్ల జగన్ ఓడిపోయారన్నారు.
జగన్ చేసిన మంచి పనుల వల్ల వైఎస్సార్సీపీలో ఉన్న ప్రతీ కార్యకర్త కాలర్ ఎగరేసుకుని ఇప్పటికీ తిరుగుతున్నారని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అడ్డగోలు అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. అయితే 2024 ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారని కూటమి పార్టీల నేతలే చంద్రబాబును విమర్శించే పరిస్థితులు వచ్చాయని కొడాలి నాని అన్నారు.
