ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని శాశ్వతంగా ఖరారు చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో చారిత్రాత్మకమైన సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఏపీ పునర్విభజన చట్టం-2014కు సవరణలు చేస్తూ, హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. గత ఐదేళ్లుగా నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ, రాజధానిగా అమరావతికి రాజ్యాంగపరమైన రక్షణ కల్పించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యం. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ సైతం ఈ బిల్లుకు బేషరతుగా మద్దతు ప్రకటించడం గమనార్హం. గతంలో తమ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు అమరావతి నిర్మాణానికి కేంద్రం పూర్తి నిధులు సమకూర్చాలని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ డిమాండ్ చేశారు.
రైతుల త్యాగం – టీడీపీ, బీజేపీల మద్దతు
బిల్లుపై చర్చ సందర్భంగా టీడీపీ తరపున కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ భావోద్వేగపూరితమైన ప్రసంగం చేశారు. ఏకంగా 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమిని రాజధాని కోసం ఇవ్వడం ప్రపంచ చరిత్రలోనే అరుదైన ఘట్టమని ఆయన కొనియాడారు. కేవలం 60 రోజుల్లోనే ఎవరినీ నొప్పించకుండా భూసేకరణ చేసిన చంద్రబాబు దార్శనికతను ఆయన గుర్తుచేశారు. అటు బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ.. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అమరావతి నిర్మాణం సాకారం కాబోతోందని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాన్ని ఈ బిల్లుతో రూపుమాపుతామని స్పష్టం చేశారు. ఈ బిల్లు ఆమోదంతో అమరావతికి నిధుల వరద పారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
వైసీపీ వాకౌట్ – రాజకీయ విమర్శలు
రాజధాని బిల్లుపై చర్చ జరుగుతుండగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తన పార్టీ వాదనను వినిపించారు. రాజధానిని ఎంచుకునే అధికారం రాష్ట్రానికే ఉంటుందని, విభజన చట్టం ప్రకారం ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. రాజధాని నిర్మాణానికి నిధుల లభ్యతపై సందేహాలు వ్యక్తం చేస్తూ, ఇది కేవలం చంద్రబాబు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ అని ఆరోపించారు. రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయని విమర్శిస్తూ వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే, పార్లమెంట్లో మెజారిటీ పార్టీల మద్దతు లభించడంతో అమరావతి ప్రస్థానం ఇక అప్రతిహతంగా కొనసాగడం ఖాయమని స్పష్టమవుతోంది.
