Site icon HashtagU Telugu

Andhra Pradesh : ఏపీలోని ఆ జిల్లాకు శుభవార్త..దశ తిరిగినట్టే.!

Ap

Ap

రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలో ఏరో స్పేస్ క్యాంపస్ ఏర్పాటు కోసం బెంగళూరుకు చెందిన సంస్థ ముందుకు వచ్చింది. బెంగళూరుకు చెందిన సర్లా ఏవియేషన్ సంస్థ కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రంలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 500 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సులోనే ఈ ఒప్పందం కుదిరింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రోన్ ట్యాక్సీలు ఏర్పాటు చేస్తామంటూ సీఎం నారా చంద్రబాబు నాయుడు విశాఖ వేదికగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. రెండేళ్లలోగా ఏపీలో డ్రోన్ ట్యాక్సీలు ప్రారంభిస్తామంటూ చంద్రబాబు సదస్సులో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. భారతదేశంలోనే తొలిసారిగా గిగా స్కేల్ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ ఏర్పాటు కోసం కర్ణాటకకు చెందిన సర్లా ఏవియేషన్‌.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది.

ఈ ఒప్పందం ప్రకారం బెంగళూరుకు చెందిన సర్లా ఏవియేషన్ సంస్థ.. ఏపీలోని 500 ఎకరాల్లో ఏరోస్పేస్ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం ప్రాంతంలో రూ.1300 కోట్లతో ఈ ఏరోస్పేస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎయిర్ ట్యాక్సీ)లను తయారు చేస్తారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రాథమికంగా రూ.1300 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించారు. భవిష్యత్ అవసరాల మేరకు పెట్టుబడిని పెంచనున్నారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా ఏటా 1000 ఎయిర్‌క్రాఫ్టులను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే దేశంలోనే తొలి గిగా స్కేల్ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ అవుతుందని అధికారులు చెప్తున్నారు.

ప్రాజెక్టు మొదటి దశలో రూ.330 కోట్ల పెట్టుబడితో తిమ్మసముద్రంలో 150 ఎకరాలలో మ్యాన్యుఫ్యాక్చరింగ్ అండ్ టెస్టింగ్ క్యాంపస్ ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్టు రెండో దశలో 350 ఎకరాలకు విస్తరిస్తారు. ఈ క్యాంపస్‌లో అత్యాధునిక సాంకేతికతతో పనిచేసే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్లు, ల్యాబ్స్, రెండు కిలోమీటర్ల మేరకు రన్ వే నిర్మాణం చేపట్టనున్నారు. ఫ్లైట్ టెస్టింగ్ కోసం దీనిని ఉపయోగించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యి పట్టాలెక్కితే.. సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగానే త్వరలోనే ఏపీలో డ్రోన్ ట్యాక్సీలను చూడొచ్చని అధికారులు చెప్తున్నారు. మరోవైపు విశాఖ భాగస్వామ్య సదస్సులో ఏపీ ప్రభుత్వం కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి వందల సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.

Exit mobile version