Free Bus Travel Scheme : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే ఎన్నికల హామీని అమల్లోకి తెచ్చే దిశగా ఏపీలోని టీడీపీ ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ స్కీం ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని రాష్ట్ర మహిళలు ఎదురుచూస్తున్నారు. ఈతరుణంలో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మోడల్లోనే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణ స్కీం అమలుపై అధ్యయన నివేదికను రెడీ చేయమని ఆదేశాలు ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join
స్కీం అమలుకు సంబంధించిన విధివిధానాలతో ఆ కమిటీ త్వరలోనే ఒక నివేదికను సీఎంకు సమర్పించనుంది. నివేదిక అందాక.. జులై 1 నుంచి ఏపీలో ఉచిత బస్సు ప్రయాణ స్కీంను(Free Bus Travel Scheme) అమలు చేసేందుకు టీడీపీ సర్కారు సమాయత్తం అవుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఏపీ రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఉచిత బస్సు ప్రయాణ స్కీంపై అధికారులు అతి త్వరలోనే నివేదికను అందివ్వనున్నారు. తర్వాత దీని అమలుపై కసరత్తు ప్రారంభమవుతుంది. చంద్రబాబుకు చెడ్డపేరు తీసుకువచ్చేలా మేం పనిచేయం. ఆయనకు మంచిపేరు తెచ్చేలా పనిచేస్తాం’’ అని తెలిపారు.
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రకటించగానే ఆటో డ్రైవర్ల నుంచి వ్యతిరేకత ఎదురైంది. తమ జీవనోపాధి దెబ్బతింటుందని వారు ఆందోళన చేశారు. దీంతో ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలను తెలంగాణ సర్కారు తీసుకోవాల్సి వచ్చింది. ఈ అనుభవాల నేపథ్యంలో ఏపీలోనూ ఆటోడ్రైవర్లకు ఇబ్బంది లేకుండా ఉచిత బస్సు ప్రయాణ స్కీంను అమలు చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు.