Free Bus Facility : ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్లోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేసేందుకు టీడీపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ పథకం అమలు కోసం ఏమేం కావాలి ? అదనంగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటి ? మానవ వనరులు, బస్సులు ఎంత అవసరం ? అనే వివరాలతో ఏపీ ఉన్నతాధికారులు ఒక సమగ్ర నివేదికను రెడీ చేశారు.దానిలో ప్రస్తావించిన ముఖ్య అంశాలివీ..
We’re now on WhatsApp. Click to Join
మరో 2వేల కొత్త బస్సులు కావాల్సిందే
అధికారుల నివేదిక ప్రకారం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం(Free Bus Facility) అమలు కోసం ఏపీఎస్ ఆర్టీసీకి అదనంగా బస్సులు కావాలి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 3,500 డ్రైవర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సమకూర్చుకున్నాక పథకాన్ని అమలు చేస్తే బాగుంటుందని ఈ నివేదికలో అధికారులు సూచించారు. ఒకవేళ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అరకొర బస్సులతోనే పథకాన్ని అమల్లోకి తెస్తే, పథకం లబ్ధిదారులు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ దగ్గర దాదాపు 10 వేల బస్సులు ఉన్నాయి. వాటిలో సొంత బస్సులు 8,220. మిగిలినవన్నీ అద్దె బస్సులే. కొంతకాలం క్రితమే దాదాపు 1,480 కొత్త బస్సులు కొన్నారు. వీటిలో ప్రతినెలా కొన్ని చొప్పున బస్సులు బాడీ బిల్డింగ్ పూర్తిచేసుకొని ఏపీలోని ఆర్టీసీ డిపోలకు చేరుతున్నాయి. అదనంగా మరో 2వేల కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తే బాగుంటుందని నివేదికలో అధికారులు సిఫారసు చేశారు. ఒకవేళ ఆ బస్సులన్నీ అందుబాటులోకి వచ్చాక పథకాన్ని అమలు చేయాలంటే దాదాపు 6 నుంచి 8 నెలల టైం పడుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు వచ్చే ఏడాదే జరగొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read :Breathing Problems: డిస్నియా అంటే ఏమిటి..? హీరో మోహన్ లాల్ సమస్య ఇదేనా..?
అదనంగా రూ.125 కోట్లను సమకూర్చాలి..
ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. అక్కడ అనుసరిస్తున్న విధానాలను కూడా ఏపీ ఆర్టీసీ ఉన్నతాధికారులు అధ్యయనం చేశారు. వాటిని కూడా సీఎం చంద్రబాబుకు వారు వివరించనున్నారు. ఈ పథకం అమలుతో ఆర్టీసీకి నెలకు రూ. 250 కోట్ల దాకా రాబడి కోల్పోతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ప్రతినెలా సర్దుబాటు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఏపీ ఆర్టీసీకి ప్రతినెలా వచ్చే రాబడిలో దాదాపు రూ.125 కోట్లను (25 శాతం) రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోంది. ఇకపై ఈ మొత్తాన్ని రాష్ట్ర సర్కారు తీసుకోకుండా మరో రూ.125 కోట్లను అదనంగా సమకూర్చాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.