ఓ కలప వ్యాపారి నుంచి రూ.23 వేలు లంచం తీసుకుంటూ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఏసీబీకి చిక్కాడు. మైలవరం అటవీ సెక్షన్ అధికారిగా పని చేస్తున్న అందూరి రామకృష్ణ లంచం తీసుకుంటుండుగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన పెండెం సురేష్ అనే గ్రామస్థుడి ద్వారా అధికారిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిగూడెం మండలం ఓబుళాపురం గ్రామపంచాయతీ పరిధిలోని సరుకుళ్లుపాడు గ్రామానికి చెందిన గండిపూడి రాంబాబు అనే కలప వ్యాపారి ఎలాంటి ఇబ్బంది లేకుండా కలప రవాణాకు సహకరించాలని కోరుతూ రామకృష్ణను సంప్రదించాడు. వచ్చే ఏడు నెలల పాటు తనకు ఎలాంటి ఫైన్ విధించవద్దని ఆయన అధికారిని అభ్యర్థించారు. దీనికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రామకృష్ణ 23 వేలు డిమాండ్ చేశాడు. దీంతో రాంబాబు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, అవినీతి అధికారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు వల వేశారు. పెండెం సురేష్ రాంబాబు డబ్బులు తీసుకుని ఆఫీసర్ రామకృష్ణ వద్దకు వెళ్లాడు. డబ్బులు ఇస్తుండగగాఏసీబీ అధికారులు వెంటనే రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Andhra Pradesh : హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే దళితులకు రక్షణ లేదా..?