ప్రభుత్వ పాలనలో టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోటీ 40 లక్షల కుటుంబాలకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి చంద్రబాబు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్మార్ట్ ఫ్యామిలీ కార్డులపై అధికారులకు పలు సూచనలు చేశారు. జూన్ నాటికి అందించాలని ఆదేశించారు.
పాలనలో సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది ఏపీ ప్రభుత్వం. అధునాతన సాంకేతికతను ఉపయోగించి పౌర సేవలను ప్రజలకు మరింత సులభతరం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్, స్మార్ట్ రేషన్ కార్డులు వంటివి తీసుకువచ్చింది. వీటి ద్వారా పౌరసేవలను సులభంగా, వేగంగాఅందించడంతో పాటుగా పారదర్శకంగా సేవలు అందించవచ్చని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే సీఎం నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2026 జూన్ లోపు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు అందజేయాలని నిర్ణయించారు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో సోమవారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్లోగా రాష్ట్రంలో స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు ఏపీలోని ప్రతీ కుటుంబాన్ని ఒక యూనిట్ కింద తీసుకుని.. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న పౌర సేవలు, సంక్షేమ కార్యక్రమాల వివరాలతోపాటుగా ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి ఈ ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేస్తారు. ఈ విధానంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని కోటీ 40 లక్షల కుటుంబాలకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు అందిస్తారు. ఈ కార్డుల మీద క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే ఆ కుటుంబానికి సంబంధించిన సమాచారం, సంక్షేమ పథకాల వివరాలు, పీ4 అంశాలు వంటివి తెలిసేలా వీటిని డిజైన్ చేయనున్నారు.
స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు.. ఏమేం తెలుసుకోవచ్చు?
స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను ఉపయోగించి కుల ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డు సేవలు, పింఛన్లు, స్కాలర్షిప్స్, వ్యాక్సినేషన్ వివరాలు. ఆధార్ కార్డుల వివరాలు వంటివి ట్రాక్ చేసేలా దీనిని రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రజలకు సంబంధించిన అన్ని వివరాలూ నమోదు చేసేలా ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డు ఉండాలని
స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు.. ఏమిటి ఉపయోగం?
స్మార్ట్ ఫ్యామిలీ కార్డులలో ఆయా కుటుంబాలకు చెందిన మొత్తం వివరాలు నమోదు చేస్తారు. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించవచ్చని ప్రభుత్వం ఆలోచన. అలాగే పౌరసేవలను సులభంగా అందించవచ్చనేది మరో ఉద్దేశం. స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ల ద్వారా కుటుంబాల వివరాలను ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్, స్మార్ట్ ఫ్యామిలీ కార్డులలో అప్ డేట్ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
