నెల్లూరు (Nellore) సిటీలోని బర్మాస్టాల్ గుంట (Burmashell Gunta)లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) చోటుచేసుకుంది. గురువారం మద్యాహ్నం అకస్మాత్తుగా మంటలు రేగాయి. ఈ ప్రమాదంలో ఆరు గ్యాస్ సిలిండర్లు పేలిపోగా.. నాలుగు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ దుర్ఘటనలో దివ్యాంగురాలు నాగలక్ష్మి (12) అనేక బాలిక దుర్మరణం చెందింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గత కొన్నేళ్లుగా ఈ పూరిగుడిసెల్లోనే కొన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నట్లు తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పూరిగుడిసెలు కావడంతో మంటలు వ్యాపించడంతో గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో లక్షల్లో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పూరిగుడిసెల్లోని వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి. బీరువాల్లోని బట్టలు, ఇతర సామాగ్రి కూడా దగ్ధమయ్యాయి.
ఈ సమాచారంతో టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ప్రమాద స్థలికి చేరుకున్నారు. మరోవైపు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పందించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.15వేలు తక్షణ సాయం ప్రకటించారు. మొత్తం 14 కుటుంబాలు ఈ అగ్నిప్రమాదంలో తీవ్రంగా నష్టపోయాయి. కట్టుబట్టలతో ఈ కుటుంబాలు రోడ్డు పాలయ్యాయి. ఈ కుటుంబాలన్నీ నిరుపేద కుటుంబాలే. బాధిత కుటుంబాలకు మంత్రి నారాయణ పంపించిన నగదును అబ్దుల్ అజీజ్ అందజేశారు.
Read Also : Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు