YS Sunitha Reddy : హత్యా రాజకీయాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత పేర్కొన్నారు. హత్యలు చేసిన వాళ్లు, చేయించిన వాళ్లు చట్టసభల్లో ఉండకూడదన్నారు. అలాంటి వాళ్లు చట్టసభల్లో కూర్చొని ఉంటే.. తన లాంటి స్థోమత కలిగిన వారే ఎదుర్కోలేకపోతున్నప్పుడు, సామాన్యుల పరిస్థితి ఇంకెలా ఉంటుందని సునీత(YS Sunitha Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. అవినాశ్ రెడ్డిని ఓడించేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని.. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తానని ఆమె చెప్పారు. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించిన తీరు గురించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. శనివారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘జగన్ అరెస్టయి జైలులో ఉన్నప్పుడు వైఎస్సార్ సీపీ పార్టీని షర్మిల భుజాన వేసుకొని నడిపించారు. అప్పట్లో జగన్ వెంట వచ్చిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆయా స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో షర్మిల దగ్గరుండి వారిని గెలిపించారు. ఆ తర్వాత ఆమెకు ఆదరణ వస్తోందని గుర్తించి జగన్ పక్కనపెట్టారు. 2014 ఎన్నికల్లో కడప నుంచి షర్మిల పోటీ చేస్తే ప్రమాదమని విశాఖకు పంపాలని నిర్ణయించారు. అనంతరం వివేకా ఓటును కూడా తొలగించారు’’ అని సునీత వివరించారు. ‘‘వివేకాను చంపిన అవినాష్రెడ్డి వైపు ఉంటారో.. న్యాయం కోసం పోరాడుతున్న నా వైపు ఉంటారో ప్రజలే తేల్చుకోవాలి’’ అని సునీత పిలుపునిచ్చారు. సీఎం జగన్, కడప ఎంపీ అవినాష్రెడ్డిపై నిప్పులు చెరిగారు. తన తండ్రి హత్యకు కారకులైన వారికి త్వరలోనే శిక్ష పడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.ఇప్పటికే పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల వైఎస్ఆర్ కడప జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా.. షర్మిల వెంట వివేకా కుమార్తె సునీత కూడా వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె జగన్పై తీవ్ర ఆరోపణలు చేశారు.
‘‘ఐదేళ్ల క్రితం మా నాయనను దారుణంగా చంపారు. ఇంకా ఇప్పటికీ ఏమీ తేలలేదు. న్యాయం అనేది సకాలంలో జరగాలి. నాలా చాలామంది విషయంలో ఇలాగే జరుగుతోంది. ఎన్నో కేసులు సుదీర్ఘకాలంలో పెండింగ్లో ఉండిపోతున్నాయి. నేను న్యాయం కోసం ఎవరిని కలవాలన్నా కలుస్తాను. ఈ పార్టీ, ఆ పార్టీ అనేది నాకు వద్దు. బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్, టీడీపీ ఏదైనా సరే.. నాకు న్యాయం చేసేందుకు ఏ పార్టీ రెడీ అయితే దానితో సంప్రదింపులకు రెడీ’’ అని వైఎస్ సునీత చెప్పారు. ‘‘ఇలాంటి హత్యా రాజకీయాలు చేస్తున్న వారు కనీసం అధికారానికి దూరమైతే .. వారి ప్రభావం తగ్గుతుందనే చిన్న ఆశతో నేను పాలిటిక్స్లోకి వస్తున్నాను. అనివార్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నాను. అవినాశ్ రెడ్డిని ఓడించేందుకు నావంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తాను’’ అని ఆమె తెలిపారు.