బెజవాడలో నారా లోకేష్ పాదయాత్ర హీట్ పుట్టిస్తుంది. ఈ రోజు సాయంత్రం ప్రకాశం బ్యారేజీ మీదుగా విజయవాడకు యువగళం పాదయాత్ర చేరుకుంటుంది. అయితే పాదయాత్ర నేపథ్యంలో వైసీపీ నేతలు అలెర్ట్ అయ్యారు. బెజవాడ అభివృద్ధి చేసింది టీడీపీ అంటూ ఆ పార్టీ నేతల కామెంట్స్కి వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. విజయవాడ నగర అభివృద్ధిపై సీఎం జగన్ కూడా సమీక్ష చేయనున్నారు. మరో వైపు లోకేష్ పాదయాత్రపై మాజీ మంత్రి వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తే లోకేష్ ఇన్ని రోజులు నడవగలుగుతాడా అంటూ ఫైర్ అయ్యారు.14 ఏళ్లు సీఎం గా ఉండి విజయవాడ కు చంద్రబాబు ఏమీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లలో విజయవాడ నగర అభివృద్ధిని పథంలో నడిపిస్తున్నామని.. లోకేష్ తనను తాను చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారని వెల్లంపల్లి అన్నారు. పాదయాత్ర చేసినా.. పాకుడు యాత్ర చేసినా ఎమ్మెల్యే గా గెలవలేడని.. లోకేష్ కి దమ్ము ఉంటే విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో పోటీ చెయ్యాలని వెల్లంపల్లి సవాల్ చేశారు. లోకేష్ మగాడు అయితే సత్తా ఉంటే వెస్ట్ నుండి పోటీ చేసి గెలవాలని.. లోకేష్ గెలిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్ చేశారు.