Eluru: ఏలూరులో రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. ఇంజినీరింగ్ విద్యార్థినిని గదిలో బంధించి టార్చర్

ఏలూరు (Eluru) జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలో దారుణం చోటుచేసుకుంది. అనుదీప్ అనే ఓ ఉన్మాది ఇంజినీరింగ్ విద్యార్థిని ప్రేమ పేరుతో చిత్రహింసలకు గురిచేశాడు.

  • Written By:
  • Publish Date - April 23, 2023 / 02:35 PM IST

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రేమ (Love)పేరుతో యువత అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రేమించకపోవడం, ఇతరులతో సన్నిహితంగా ఉండడం, మాట వినకపోవడం లాంటి చిన్న కారణాల వల్ల అమ్మాయిలు బలవుతున్నారు. తాజాగా ఏలూరు (Eluru) జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలో దారుణం చోటుచేసుకుంది. అనుదీప్ అనే ఓ ఉన్మాది ఇంజినీరింగ్ విద్యార్థిని ప్రేమ పేరుతో చిత్రహింసలకు గురిచేశాడు. యువతిని గదిలో బంధించి యువతీ శరీరంపై వేడి నూనె పోశాడు.

గత పది రోజులుగా ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని చెప్పి గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేసి నరకం చూపించాడు. అనుదీప్ నుంచి తప్పించుకున్న బాధితురాలు కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. బాధితురాలి తల్లిదండ్రులు వెంటనే దుగ్గిరాల వద్దకు చేరుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రేమ పేరుతో తనను నమ్మించి అనుదీప్ చిత్రహింసలకు గురిచేశాడని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు వెల్లడించింది.

Also Read: TTD: టీటీడీని పోలిన మరో నకిలీ వెబ్ సైట్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు

బాధితురాలు మాట్లాడుతూ.. “ఈస్టర్ తర్వాత నన్ను తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గదిలో బంధించాడు. రోజంతా తాగి గత పది రోజులుగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. వేడి నూనె పోసి నన్ను హింసించాడు. నా తలపై కొట్టి చంపేందుకు ప్రయత్నించాడు” అని బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అనుదీప్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.