ఏపీ శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas)పై వైసీపీ (YCP) అధిష్టానం సస్పెన్షన్ (Suspension) వేటు వేసింది. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలతో మంగళవారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఇది రాజకీయ వర్గాల్లో కలకలం రేపగా, దువ్వాడ తీరుపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. అయితే సస్పెన్షన్పై స్వయంగా దువ్వాడ శ్రీనివాస్ స్పందిస్తూ..ఇది తాత్కాలిక విరామం మాత్రమేనని , తన రాజకీయ జీవితానికి బీజం వేసింది జగన్నేనంటూ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
BRS Party : బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్గా మార్చబోతున్నారా ?
దువ్వాడపై సస్పెన్షన్ వేటుకు అసలు కారణం ఏంటన్నదనిపై వివిధ వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్ను ఓ ఇంటర్వ్యూలో పొగడటమే దానికి కారణమని విశ్లేషణలొస్తున్నాయి. ‘బాలయ్య తర్వాత స్వీటెస్ట్ పర్సన్ ఎవరు?’ అన్న ప్రశ్నకు దువ్వాడతో పాటు ఆయనతో సహజీవనం చేస్తున్న మాధురి కూడా ‘లోకేష్’ అని సమాధానమిచ్చారు. లోకేష్ తెలివైన నాయకుడని, సీఎం పదవిలో ఆయన అభివృద్ధి సాధిస్తారని చేసిన వ్యాఖ్యలు వైసీపీ అధిష్టానానికి నచ్చకపోయినట్టుగా చెబుతున్నారు. దీంతో వ్యక్తిగత వివాదాల కన్నా రాజకీయంగా పార్టీ నిర్ణయం తీసుకుందని అర్థమవుతోంది.
తన సస్పెన్షన్ను లైట్గా తీసుకుంటూ, రాజకీయంగా తాను త్వరలోనే తిరిగి వస్తానని దువ్వాడ ధీమాగా వెల్లడించారు. జగన్ తనను పార్టీలోకి తీసుకువచ్చి తన ఎదుగుదలకు కారణమయ్యారని , ఆయనపై తనకున్న గౌరవం ఏమాత్రం తగ్గదని స్పష్టంగా చెప్పారు. పార్టీలో తిరిగి కీలక భూమిక పోషిస్తానన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, తాత్కాలికంగా ఉన్న విరామం తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వస్తానని వెల్లడించారు.