Site icon HashtagU Telugu

AP TG CMs Davos Tour: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. ఏం చర్చించారంటే?

Ap Tg Cms Davos Tour

Ap Tg Cms Davos Tour

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబు ఈరోజు (సోమవారం) దావోస్‌ వెళ్లారు. జ్యూరిచ్‌ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, కింజారపు రామ్మోహన్ నాయుడు అధికారుల బృందానికి యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. పెట్టుబడిదారులతో జ్యూరిచ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు సమావేశం కానున్నారు. అయితే అంతకముందు జ్యూరిచ్‌ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది.

చంద్రబాబు ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో తెలుగు సంతతికి చెందిన పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి దావోస్‌కు వెళ్తారు. అనంతరం, పారిశ్రామిక వేత్తలతో ఆర్సెలర్స్ మిట్టల్ సంస్థ యజమాని లక్ష్మీ మిట్టల్‌తో డిన్నర్ మీట్ ఉంటుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రెండో రోజు దావోస్‌లో గ్రీన్ హైడ్రోజన్‌ పై జరుగుతున్న ప్రత్యేక సెషన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. అలాగే, కోకాకోలా, ఎల్‌జీ మరియు ఇతర ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు పెట్టుబడులు ఆకర్షించడం మాత్రమే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్‌లో పర్యటిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు మరియు వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. రాష్ట్రాలలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు కూడా దావోస్‌లో పర్యటిస్తున్నారు.

యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్‌తో భేటీ అవబోతున్నారు.. ఎనర్జీ ట్రాన్సిషన్‌, ది బ్లూ ఎకానమీ అంశాలపై జరిగే సెషన్లలో చంద్రబాబు ప్రధాన ఉపన్యాసం ఉంటుంది. దావోస్ టూర్‌లో నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వూలు ఇవ్వనున్నారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ సదస్సులో భాగంగా మూడోవ రోజు పలువురు వ్యాపారవేత్తలు, వాణిజ్య సంస్థల యజమానులు, మరియు ప్రతినిధులతో సమావేశం అవుతారు. చంద్రబాబు అండ్ టీమ్ నాలుగోవ రోజు జ్యూరిచ్‌ చేరుకుని అక్కడి నుంచి భారత్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.