YSRCP Office Demolition : వైఎస్సార్ సీపీకి టీడీపీ సర్కారు శనివారం తెల్లవారుజామునే బిగ్ షాక్ ఇచ్చింది. తాడేపల్లిలో నిర్మాణ దశలో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయ భవనం కూల్చివేత పనులను సీఆర్డీఏ అధికారులు ఉదయం 5.30 గంటలకు ప్రారంభించారు. ప్రొక్లెయినర్లు, బుల్డోజర్లతో భవనాన్ని కూల్చివేయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వైఎస్సార్ సీపీ ఈ భవనాన్ని నిర్మించిందని..దీనిపై తాము శుక్రవారం రోజే ప్రొసీడింగ్స్ ఇచ్చామని అధికారులు అంటున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వ చర్యపై వైఎస్సార్ సీపీ మండిపడుతోంది. హైకోర్టు ఆదేశాలను అధికారులు బేఖాతరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏపీ సర్కారు కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని, ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వైఎస్సార్ సీపీ(YSRCP Office Demolition) నేతలు అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join
సీఆర్డీఏ అధికారులు కొన్ని రోజుల కిందటే వైఎస్సార్ సీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. ఇరిగేషన్కు సంబంధించిన స్థలంలో భవన నిర్మాణం జరుగుతోందని, ఈ నిర్మాణానికి అనుమతులు లేవని తెలియజేశారు. అక్కడ భవన నిర్మాణ పనులను అప్పుడే ఆపేశారు. ఇకపై నిర్మాణ పనులు చేయొద్దని పేర్కొంటూ సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇరిగేషన్ స్థలంలో నిర్మాణ దశలో ఉన్న భవనాన్ని కూల్చేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దీన్ని సవాల్ చేస్తూ వెంటనే వైఎస్సార్ సీపీ హైకోర్టును ఆశ్రయించింది. శుక్రవారం రోజు హైకోర్టులో వైఎస్సార్ సీపీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీంతో రూల్స్కు విరుద్ధంగా వెళ్లొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
హైకోర్టు ఇచ్చిన ఆదేశాల కాపీలను వైఎస్సార్ సీపీ తరపు న్యాయవాదులు సీఆర్డీఏకు పంపించారు. ఈనేపథ్యంలో శనివారం తెల్లవారుజామున నిర్మాణ దశలో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయ భవనాలను కూల్చివేశారు. దీంతో మళ్లీ హైకోర్టుకు ఈ విషయాన్ని తీసుకెళ్లేందుకు వైఎస్సార్ సీపీ న్యాయవాదులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.