Site icon HashtagU Telugu

Amaravati TTD Temple : కృష్ణమ్మకు నిత్య హారతి.. కళ్లు చెదిరేలా టీటీడీ ఆలయం.. సీఎం చంద్రబాబు ప్లాన్‌ ఇదే!

Amaravati Ttd Temple

Amaravati Ttd Temple

అమరావతిలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల మాస్టర్‌ ప్లాన్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఆలయం క్లీన్, గ్రీన్, హైజినిక్‌‌గా ఉండటంతో పాటు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలని సూచించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అన్నప్రసాదం భవనాన్ని విస్తరించాలని చెప్పారు. ఇక కృష్ణమ్మకు నిత్యహారతి ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. కాగా, విస్తరణలో భాగంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 7 అంతస్తుల్లో మహా రాజగోపురంతో పాటు మూడు రాజగోపురాలు నిర్మించనున్నారు. భక్తులు, వీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

దేవతల రాజధానిగా సీఎం చంద్రబాబు అభివర్ణించిన అమరావతిలో దేవదేవుడి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబువుతోంది. అమరావతిలోని వెంకటపాలెం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనుల మాస్టర్‌ ప్లాన్‌ను చంద్రబాబు పరిశీలించారు. ఈ మేరకు అధికారులకు పలు సూచనలు చేశారు. ఆలయం క్లీన్, గ్రీన్, హైజినిక్‌ మోడల్‌ ఉండాలని చెప్పారు. ఆలయ నిర్మాణాల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడాలని.. అమరావతికి వేంకటేశ్వర ఆలయం అదనపు ఆకర్షణ కావాలన్నారు. ప్రస్తుతం వెయ్యి మందికి సరిపోయేలా నిర్మిస్తున్న అన్నప్రసాదం అందించే భవనం.. భవిష్యత్తులో 20 వేల మందికి సరిపోయేలా విస్తరించేలా ప్లాన్ ఉండాలని తెలిపారు. అందుకు అనుగుణంగా పునాది పనులు చేపట్టాలని సూచించారు. ఆలయ చేపట్టిన అన్ని నిర్మాణాల్లోనూ ఇదే విధానంతో ముందుకు వెళ్లాలని తెలిపారు.

ఆలయ నిర్మాణ పనులు రెండు దశల్లో చేపట్టే ప్రతిపాదనలు ఏం వద్దని.. ఒకే దశలో అన్ని చేపట్టాలని చంద్రబాబు సూచించారు. తిరుమల శ్రీవారి ఆలయ తరహాలోనే.. వాస్తు పరిమితికి లోబడి నిర్మాణాలు ఉండాలని చెప్పారు. కృష్ణా నదికి అభిముఖంగా రెండెకరాల్లో 50 కాటేజీలు నిర్మించాలని.. నిత్య పూజలు, భజనలు ఉండాలన్నారు. అంతేకాకుండా ఆలయం పక్కనున్న కృష్ణా నదిలో.. గంగా హారతి మాదిరిగా.. సాయంత్రం కృష్ణమ్మ నిత్యం హారతి ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు.

ఆలయ ప్రాంగణంలో ధ్యాన మందిరాన్ని నిర్మిస్తారు. గ్రౌండ్‌ ఫ్లోర్, మొదటి అంతస్తుతో కలిపి దీన్ని నిర్మిస్తారు. ఇందులో ఎగ్జిబిషన్ హాళ్లు ఉండనున్నాయి. ఇక భవిష్యత్తులో మరింత విస్తరించేందుకు వీలుగా డైనింగ్‌ హాల్, కిచెన్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపడుతున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం.. హెల్ప్‌ డెస్క్‌లు, కల్యాణ కట్ట, డార్మెటరీలు, లాక్‌ రూమ్, 3 వెయిటింగ్‌ హాల్స్‌ నిర్మిస్తున్నారు.

ఇక అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్‌లో వివిధ సేవలకు టికెట్లు అందించేందుకు రిజిస్ట్రేషన్‌ కౌంటర్లు, సిబ్బందికి గదులు, ప్రథమ చికిత్స గది ఏర్పాటు చేస్తారు. 12 మంది ప్రధాన అర్చకులకు, 12 మంది సిబ్బందికి క్వార్టర్లు నిర్మిస్తారు. అలాగే ఎవరైనా విశిష్ట అతిథులు వస్తే బస, విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా.. ఓ విశ్రాంతి భవనాన్ని నిర్మించనున్నారు. అందులో రెండు వీవీఐపీల సూట్స్, 3 వీఐపీ సూట్స్, డైనింగ్‌ హాల్, సమావేశ గది, ఏసీ సదుపాయంతో 20 గదులు, వీఐపీ లాబీ, కిచెన్, ప్యాంట్రీ, రిసెప్షన్‌ వంటి అన్ని సౌకర్యాలు ఉండనున్నాయి.

భక్తులకు ప్రసాదాలు అందించడానికి 8 ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా 3 ఎకరాల్లో నిర్మిస్తున్న ప్రకాశ్‌ ఉద్యానంలో లేజర్‌ షో ఏర్పాటు చేయనున్నారు. ఆలయ గోడలు, అంతర్గత రహదారులు, ప్రధాన ముఖద్వారం నిర్మించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు.

ఆలయం తూర్పు వైపు 110 అడుగుల ఎత్తున, 7 అంతస్తుల్లో మహా రాజగోపురం నిర్మిస్తారు. మిగతా 3 వైపులా 60 అడుగుల ఎత్తుతో ఐదు అంతస్తుల్లో రాజగోపురాలు నిర్మించనున్నారు. కల్యాణ మండపం, అద్దాల మండపం, రథ, ఆర్జి, వాహన వంటి సేలవకు ప్రత్యేక మండపాలు, పుష్కరిణి కూడా నిర్మించడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. అయితే ఈ పనులు ఇప్పటి టెండర్లు ఆహ్వానించి గుత్తేదార్లను ఎంపిచ చేశారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.

Exit mobile version