బిజెపి నేత, మాజీ MLC వాకాటి నారాయణరెడ్డి (Vakati Narayana Reddy)కి సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) నరకం చూపించారు. సెల్ఫ్ కస్టడీ పేరుతో ఆరు రోజులు అష్ట దిగ్భందం చేసి , మానసికంగా వేధించారు. CBI పేరు చెప్పి వ్యక్తిగత వివరాలు సేకరించారు. 15 కోట్లు ఇస్తే కేసులు లేకుండా వదిలేస్తామంటూ బేరాలు ఆడారు. చివరి నిమిషంలో వారు సైబర్ నేరగాళ్లని గుర్తించి బయటపడ్డారు.
ఇటీవల సైబర్ నేరగాళ్లు సరికొత్త దందాలకు పాల్పడుతున్నారు. గతంలో బ్యాంకు ఖాతాల నుండి డబ్బు దోచుకునే వారు..కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ఫోన్ లు చేయడం పోలీసులమని చెప్పి బెదిరింపులకు పాల్పడడం..డబ్బులు డిమాండ్ చేయడం చేస్తున్నారు. ఇటీవల సుప్రీంకోర్ట్ సెటప్ వేసి మరీ డిజిటల్ అరెస్ట్ పేరిట వర్ధమాన్ గ్రూపు ఎండీని దాదాపు రూ.7 కోట్ల మేర ముంచారు. తాజాగా బిజెపి నేత, మాజీ MLC వాకాటి నారాయణరెడ్డిని సైతం అలాగే బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. సెప్టెంబర్ 27న వాకాటి నారాయణ రెడ్డికి ఓ ఫోన్కాల్ వచ్చింది. ఫెడెక్స్ పార్సిల్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని నమ్మించారు. థాయ్లాండ్లో ఉంటున్న జాన్జ్లిన్ అనే వ్యక్తికి ఒక పార్సిల్ పంపించారు కదా అని అడిగాడు. తాను పార్సిల్ పంపించలేదని వాకాటి సమాధానం ఇవ్వగా.. అయితే ‘ఎవరో మీ ఆధార్ను దుర్వినియోగం చేశారు’ అని కేటుగాడు నమ్మించాడు. పార్సిల్లో 200 గ్రాముల డ్రగ్స్, 6000 అమెరికన్ డాలర్లు, పాస్పోర్టు, బ్యాంక్ కార్డులు, దుస్తులు, లాప్ట్యాప్ ఉన్నాయని చెప్పారు. పార్సిల్ పంపలేదంటున్నారు కాబట్టి ముంబై సీబీఐ బ్రాంచ్కు ఫిర్యాదు చేయాలని తెలిపి..వాకాటి కాల్ను ముంబైలో అప్పటికే సెటప్ వేసి ఉంచిన ఫేక్ సీబీఐ ఆఫీస్ కు కనెక్ట్ చేశారు.
నిజమైన సీబీఐ కార్యాలయం అని నమ్మిన వాకాటి పార్సిల్కు సంబంధించి వాళ్లు చెప్పిన విషయాలనే ఫిర్యాదు చేశారు. రవీంద్ర పేరుతో అధికారిగా నమ్మించిన ఓ కేటుగాడు ఫిర్యాదు నమోదు చేస్తున్నట్టు నమ్మించాడు. వాట్సప్ కాల్ లో ఫిర్యాదు చేయాలని చెప్పడంతో వాకాటి వాట్సప్ కాల్ చేశారు. అప్పటి నుంచి దాదాపు వారంపాటు నరకం చూపించారు. తొలుత వీడియోకాల్లో ఆధార్ కార్డు చూపించాలని కోరారు. చూపించిన కొన్ని నిమిషాల తర్వాత మీ మీద మనీ ల్యాండరింగ్ కేసులు, సీబీఐ కేసులు ఉన్నాయని కేటుగాళ్లు తెలిపారు. అవి తమ వ్యాపారానికి సంబంధించిన కేసులని వాకాటి చెప్పగా.. తాము పరిశీలిస్తామని, సెల్ఫ్ కస్టడీలో ఉండాలని వాకాటిని ఆదేశించారు. ఫోన్ కాల్ కట్ చేయవద్దని, ఎక్కడికి వెళ్లినా వాట్సప్ కాల్లోనే ఉండాలని చెప్పి భయపెట్టారు.
సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 03 వరకు కూడా వాకిటి ఫోన్ కాల్ లోనే ఉన్నారు. అక్టోబర్ 3న గౌడ అనే పేరుతో సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్న కేటుగాడు.. బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయని చూపించాడు. కొన్ని నిమిషాల తర్వాత డీఎస్పీని అంటూ పరిచయం చేసుకున్న మరో వ్యక్తి రూ.15 కోట్లు చెల్లిస్తే మ్యాటర్ సెటిల్మెంట్ చేస్తానని చెప్పడం తో వాకాటికి వీరు CBI కాదు సైబర్ నేరగాళ్లు అనే అనుమానం వచ్చింది. డబ్బులు లేవని ఆయన చెప్పడంతో కేటుగాళ్లు దుర్భాషలాడడం మొదలుపెట్టారు. దీంతో నిన్న (సోమవారం) నెల్లూరు పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. మొత్తం మీద వాకిటి..సైబర్ నేరగాళ్ల నుండి బయట పడ్డారు. ఇలా సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు..మీకేమయిన ఇలాంటి కాల్ వస్తే వెంటనే పోలీస్ స్టేషన్ లలో పిర్యాదు చెయ్యండి.
Read Also : AP Intermediate: రాబోయే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ సిలబస్లో మార్పులు