గ్లోబల్ సమ్మిట్ కు( Global Summit) ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కార్ సిద్దమవుతోంది. అందుకోసం విశాఖను(Vizag) ముస్తాబు చేసింది. ఢిల్లీ వేదికగా ఏపీ రాజధాని విశాఖ అంటూ పారిశ్రామికవేత్తలకు ఇటీవల ఆయన చెప్పారు. ఆ తరువాత వచ్చిన పరిణామాల క్రమంలో పారిశ్రామికవేత్తలకు మాత్రమే విశాఖ రాజధానిగా చెప్పామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి అటూఇటూ కాకుండా చెప్పారు. ఒక వైపు సుప్రీం కోర్టులో ఏపీ రాజధాని అంశం ఉండగా మరో వైపు విశాఖ రాజధాని అంటూ జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇదంతా ఎన్నికవేళ పారిశ్రామికవేత్తల పెట్టుబడుల కోసమంటూ రాజకీయ వర్గాల్లోని టాక్.
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమ్మిట్ కు (Global Summit) ఒక రోజు ముందే విశాఖ వెళుతున్నారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి సిద్దమయ్యారు. మూడు రోజుల పాటు ఆయన విశాఖలోనే(Vizag) బస చేయనున్నారు. ఈ సదస్సు ద్వారా పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంలోని వనరుల గురించి వివరించి, పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహక సదస్సు ఢిల్లీలో జరిగిన విషయం విదితమే. గ్లోబల్ సమ్మిట్ ను ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇలాంటి సమయంలో ఏపీ రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి నగరాల జాబితాలోకి వెళ్లింది. టాప్-6 నగరాల్లో ఒకటిగా ఆవిష్కరించనుందని ప్రతిష్టాత్మక ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ మేగజైన్ తేల్చేసింది. మేగజైన్ ప్రచురించిన ప్రపంచ భవిష్యత్ నగరాల జాబితాలో అమరావతి ఉండడం గమనార్హం.
సుప్రీం కోర్టులో అమరావతి ఇష్యూ ఉంది. మరో వైపు అమరావతి గురించి ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ మేగజైన్ ఇచ్చిన న్యూస్ వెరసి విశాఖలో (Vizag) జరగనున్న పెట్టుబడుల సదస్సు ఫెయిల్ కావడానికి అవకాశం ఉంది. ఇదే విషయాన్ని వైసీపీ లీడర్లు ప్రస్తావిస్తూ టీడీపీ ఉద్దేశపూర్వకంగా విశాఖలోని సమ్మిట్ (Global Summit)విజయవంతం కాకుండా అడ్డుకుంటుందని ఆరోపిస్తున్నారు. ఒక వేళ ఆ సదస్సు ఫెయిల్ అయితే టీడీపీ మీద నెట్టేయడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ సిద్దమయింది. ఇప్పటికే విశాఖను రాజధానిగా చెబుతోన్న జగన్మోహన్ రెడ్డి మాటలను పూర్తిగా నమ్మే పరిస్థితి పారిశ్రామివేత్తల్లో లేదు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ప్రపంచ వ్యాప్తంగా ఫోకస్ అయింది.
Also Read : Amaravathi : మౌనంగా ఎదుగుతోన్న `అమరావతి`
విశాఖ కేంద్రంగా పారిశ్రామికవేత్తల సదస్సు లను(Global Summit) చంద్రబాబు సీఎంగా ఉండగా పెట్టారు. ఆ సందర్భంగా సుమారు 25లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి. వాటిలో 15 శాతం వరకు పెట్టుబడులు రావడం కూడా జరిగింది. ఆ విషయాన్ని ఆనాడే చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఆయన పెట్టిన సదస్సులను అడ్డుకోవడాని అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నానా యాగీ చేశారు. పారిశ్రామిక వేత్తల సదస్సు జరిగే ప్రతిసారీ విశాఖలో (Vizag) ఆందోళన కార్యక్రమాలకు జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చిన సందర్భాలు అనేకం. అయినప్పటికీ భారీ ఒప్పందాలను చంద్రబాబు ఆనాడు చేసుకున్నారు. అవన్నీ దాదాపుగా ఇప్పుడు రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయి. కొన్ని ఉన్నప్పటికీ పలు రకాల ఇబ్బందుల మధ్య నడుస్తున్నాయి. కియా కంపెనీ ఉద్యోగులపై వైసీపీ లీడర్ల దురుసు ప్రవర్తన చూశాం. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య జగన్మోహన్ రెడ్డి చేస్తోన్న ప్రయత్నం వచ్చే ఎన్నికల కోసం ఆయనకు సానుకూల అవకాశం ఉందేమోగానీ, శాశ్వతంగా రాష్ట్ర భవిష్యతును మార్చేలా లేదని సర్వత్రా వినిపిస్తోంది.
సదస్సును విజయవంతం చేయడానికి ఒక లోగోను(Global Summit) కూడా రూపకల్పన చేశారు. దానితో సొంత మీడియా ప్రచారం బాగా చేస్తోంది. డాలర్ ను నోట్లో పెట్టుకుని వస్తోన్న చిలుకను లోగో మాదిరిగా క్రియేట్ చేశారు. సదస్సు లోగో గా దాన్ని అందంగా తీర్చిదిద్దుతూ ప్రకటనలను గుప్పించారు. సొంత మీడియా ఖజానా నింపేలా యాడ్స్ భారీగా ఇచ్చారు. దానికి తగిన విధంగా పారిశ్రామికవేత్తల నుంచి స్పందన రావడం అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పటికే అమరావతి రాజధాని ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలు భారీగా నష్టపోయారు. హాపీ నెక్ట్స్ ప్రాజెక్టును మూలనపడేసిన జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులను ఎలా ఆహ్వానిస్తారు? అనేది అనుమానమే. ఎందుకంటే ఆ ప్రాజెక్టు మీద పెట్టుబడులు పెట్టిన వాళ్లు న్యాయపోరాటం చేస్తున్నారు. వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలని కూడా కోర్టు చెప్పింది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో డాలర్లు తీసుకొచ్చే వైసీపీ చిలుకలు ఎన్ని ఉంటాయో చూడాలి.
Also Read : Amaravati: అమరావతికి సుప్రీం ముహూర్తం! అసెంబ్లీలో ‘మూడు’ లేనట్టే!