YSRCP Slogan : ‘‘ఒకే ఒక్క ఛాన్స్’’ నినాదం 2019 ఎన్నికల్లో ఎమోషన్ను పండించింది. వైఎస్సార్ సీపీని విజయతీరాలకు చేర్చింది. మరి ఈ ఎన్నికల కోసం వైఎస్సార్ సీపీ ఏ నినాదాన్ని తయారు చేసింది ? అనే దానిపై అంతటా డిస్కషన్ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన ఒక సమాచారం బయటికి వచ్చింది. ‘‘జగన్ చెప్పిందే చేస్తాడు.. చేయలేనిది చెప్పడు’’ అనే నినాదంతో ఈసారి ఎన్నికల సమరానికి వైఎస్ జగన్ రెడీ అవుతున్నారని తెలుస్తోంది. దీంతోపాటు తన ఎన్నికల మేనిఫెస్టోలోని తొమ్మిది హామీలతో కూడిన నవరత్నాలకు మరింత మెరుగులు దిద్దడంపై జగన్ అండ్ టీమ్ కసరత్తు చేస్తోందట.గత ఎన్నికల్లో ‘‘జగన్ మాటతప్పడు, మడమ తిప్పడు’’ డైలాగ్ ఫేమస్ అయినట్టే ఈసారి ‘‘జగన్ చెప్పిందే చేస్తాడు.. చేయలేనిది చెప్పడు’’ నినాదం(YSRCP Slogan) ఫేమస్ అవుతుందని వైఎస్సార్ సీపీ అంచనా వేస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
తన కోసం ఎన్నికల వ్యూహరచన చేస్తున్న ఐప్యాక్ ప్రతినిధులతో ఇటీవల సీఎం జగన్ భేటీ అయ్యారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏయే అంశాలు ఉంటే బాగుంటుందనే దానిపై ఈసందర్భంగా చర్చ జరిగిందట. ఇప్పటి వరకు పల్లె ప్రజలను దృష్టిలో ఉంచుకుని అన్ని హామీలు అమలు చేసిన వైసీపీ.. ఇప్పుడు పట్టణ ఓటర్లనూ ఆకర్షించేలా మేనిఫెస్టోను రెడీ చేయిస్తున్నారట. అభివృద్ధి, సంక్షేమం రెండూ సమతూకంగా కనిపించేలా వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో ఉండనుందట. ముఖ్యంగా పట్టణ యువతను టార్గెట్గా ఎంచుకున్నారని తెలిసింది. పరిశ్రమల్లో స్థానిక యువతకు 75శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ఇప్పటికే చట్టం తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే దీన్ని పక్కాగా అమలు చేస్తామని అంటోంది. యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చేలా కొత్తపథకాలకు శ్రీకారం చుట్టే అంశాన్ని కూడా మేనిఫెస్టోలో వైసీపీ చేర్చనుందట.ఇంటింటికి మంచినీటి కుళాయి ఏర్పాటుపైనా జగన్ హామీ ఇస్తారని తెలుస్తోంది. నాడు, నేడు పథకం కింద ఇప్పటివరకు విద్య, వైద్యశాఖలనే తీసుకురాగా.. ఈసారి గెలిస్తే మరో మూడు, నాలుగుశాఖలను కూడా తీసుకురావాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. ప్రజలకు నిత్యం అవసరమయ్యే శాఖలే ఈ లిస్టులో ఉంటాయని సమాచారం.
ఈనెల 27 నుంచి సీఎం వైఎస్ జగన్ చేపట్టనున్న ఎన్నికల ప్రచారయాత్రలో ‘‘జగన్ చెప్పిందే చేస్తాడు.. చేయలేనిది చెప్పడు’’ అనే నినాదమే ఇక వినిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా జగన్కు ఓట్లు తెచ్చిపెట్టిన అమ్మఒడి, జగనన్న ఇల్లు, ఆసరా పింఛన్లు, రైతుబంధు, చేయూత పథకాలను ఈసారీ నవరత్నాలలో కంటిన్యూ చేయనున్నారు.