NTR Bharosa Pension : పెంచిన సామాజిక పింఛన్ల పంపిణీని స్వయంగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఇవాళ ఉదయం 5.45 గంటలకు బయలుదేరిన చంద్రబాబు పెనుమాక గ్రామానికి చేరుకొని అక్కడ ఉదయం 06.20 గంటలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎస్టీ కాలనీలోని పలువురు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పింఛను డబ్బులను సీఎం చంద్రబాబు అందజేశారు.
We’re now on WhatsApp. Click to Join
ఈసందర్భంగా పెనుమాక గ్రామంలోని మసీదు సెంటరులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మీకొక మంచి ఎమ్మెల్యే దొరికారు’’ అంటూ పరోక్షంగా నారా లోకేష్ను ఆయన ప్రశంసించారు. ‘‘పట్టిన పట్టు వదలకుండా మీ మంగళగిరి నియోజకవర్గంలోనే పోటీ చేసి నారా లోకేష్ గెలిచారు. మీరు ఆశీర్వదించి 90వేలకుపైగా ఓట్ల మెజారిటీ ఇచ్చారు’’ అని చంద్రబాబు తెలిపారు. ఐదేళ్ల జగన్ పాలనలో విసిగి వేసారిన ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పట్టారని ఆయన చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకున్నానని.. పింఛన్ల మొత్తాన్ని పెంచానని చంద్రబాబు తెలిపారు. మిగతా హామీలను కూడా తప్పకుండా నెరవేరుస్తానని ఆయన(NTR Bharosa Pension) స్పష్టం చేశారు. ఇవాళ ఏపీ వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4,408 కోట్లు విడుదల చేసింది.
ఈ కార్యక్రమంలో భాగంగా పింఛను లబ్ధిదారులతో చంద్రబాబు ముచ్చటించారు. కాగా, టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా సవరించిన పింఛన్లను గడిచిన మూడు నెలలకు కూడా వర్తింపచేశారు. ఏపీలో మొత్తం 28 విభాగాలకు చెందిన లబ్దిదారులకు పెన్షన్ అందజేయనున్నారు.వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్య కారులు, కళా కారులు, డప్పు కళాకారులు, చేనేత, కల్లుగీత కార్మికులు, ట్రాన్స్ జెండర్స్ వంటి వారికి ఇక రూ.4000 పింఛను అందుతుంది. దివ్యాంగులకు పింఛన్ రూ.6000 ఇస్తారు. పింఛన్ల పంపిణీ కోసం ఒక్కో గ్రామ సచివాలయ ఉద్యోగికి 50 మంది పింఛనుదారులను కేటాయించారు. అంతకుమించి ఉంటే కొన్నిచోట్ల అంగన్వాడీ, ఆశా సిబ్బందిని వినియోగించనున్నారు. ఏదైనా కారణంగా తొలి రోజు పింఛను అందుకోలేని వారికి రెండోరోజు వారి ఇళ్ల వద్దే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది అందిస్తారు.