Site icon HashtagU Telugu

CM Chandrababu: సింగపూర్‌కు సీఎం చంద్రబాబు పర్యటన.. ఆరు రోజులపాటు విదేశీ ట్రిప్‌!

CM Chandrababu

CM Chandrababu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (CM Chandrababu) ఈ నెల 26 నుంచి 31 వరకు 6 రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దావోస్ పర్యటన అనంతరం ఇది ఆయన రెండో విదేశీ పర్యటన. ఈ పర్యటన ద్వారా “బ్రాండ్ ఏపీ”ని ప్రచారం చేస్తూ రాష్ట్రానికి పెట్టుబడులను సాధించాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు సింగపూర్‌లోని ప్రముఖ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను రాష్ట్రానికి ఆహ్వానిస్తారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, హైవేలు, హార్బర్లు, భూముల లభ్యత, కనెక్టివిటీ, 1053 కి.మీ తీర ప్రాంతం, నిపుణులైన మానవ వనరుల గురించి ఆయన వివరిస్తారు. పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు.

Also Read: Blood Circulation : మెదడుకు రక్త ప్రసరణ సరిగా అవుతుందా? లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే?

తెలుగు డయాస్పోరా సమావేశం

పర్యటనలో మొదటి రోజు సింగపూర్‌తో పాటు సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే ‘తెలుగు డయాస్పోరా’ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఏపీలో పెట్టుబడులపై వారిని ఆహ్వానిస్తారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం పారిశ్రామికవేత్తలను కోరనున్నారు.

ఈ ఏడాది నవంబర్‌లో విశాఖపట్నంలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు కూడా సీఎం ఆ దేశానికి చెందిన ప్రముఖులతో భేటీ అవుతారు. ఏపీలో పోర్టు ఆధారిత ప్రాజెక్టులు, సెమికండక్టర్లు, ఏఐ, డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడులపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. డిజిటల్ ఎకానమీ, ఫిన్‌టెక్‌పై నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే సింగపూర్‌లో నిర్వహించే బిజినెస్ రోడ్‌షోకు హాజరవుతారు. ఆ దేశంలోని వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను కూడా సీఎం సందర్శించనున్నారు.