రాజధాని అమరావతిని భవిష్యత్తులో ప్రపంచస్థాయి ఆరోగ్య కేంద్రంగా (గ్లోబల్ హెల్త్ హబ్) తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గతంలో హైదరాబాద్లో హెల్త్ టూరిజాన్ని ప్రోత్సహించిన విధంగానే, రాబోయే రోజుల్లో ప్రపంచ నలుమూలల నుంచి రోగులు అమరావతికి వచ్చి చికిత్స పొందేలా వసతులను కల్పిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గుంటూరులో నూతనంగా ఏర్పాటు చేసిన లలితా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనంతరం ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గుంటూరులో 600 పడకలతో, 32 విభాగాలతో, అత్యాధునిక వసతులతో లలితా ఆసుపత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉందని ఉందన్నారు. ముఖ్యంగా, దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ఆధునిక ఎమ్ఆర్ఐ స్కాన్ను ఇక్కడ ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. “ఒక బ్రాండ్కు విలువలు, ప్రజల్లో విశ్వసనీయత తోడైతే దానికి తిరుగుండదు. దశాబ్దాలుగా వైద్య రంగంలో ఉన్న లలితా గ్రూప్ అందుకు నిదర్శనం” అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు
రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని సమూలంగా మారుస్తున్నామని చంద్రబాబు తెలిపారు. “ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ‘సంజీవని’ ప్రాజెక్టును తీసుకొచ్చాం. దీని ద్వారా ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ రికార్డులను నిర్వహిస్తాం. వ్యాధి రాకముందే గుర్తించడం (ప్రిడిక్టివ్), రాకుండా నివారించడం (ప్రివెంటివ్), వచ్చాక నయం చేయడం (క్యూరేటివ్) అనే త్రిముఖ వ్యూహంతో పనిచేస్తాం. ఇంటి వద్దకే వచ్చి 42 రకాల వైద్య పరీక్షలు చేస్తాం” అని వివరించారు. రాష్ట్రంలో ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’ని అమలు చేసి, ప్రతి కుటుంబానికి రూ. 2.5 లక్షల వరకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఆరోగ్యమే అసలైన సంపద అని, ఆరోగ్యకరమైన పౌరులే సంపన్న దేశాన్ని నిర్మిస్తారని చంద్రబాబు అన్నారు. మంచి ఆహారం, వ్యాయామం, యోగా, ప్రాణాయామం వంటివి జీవనశైలిలో భాగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. “మన వంటిల్లే మన ఫార్మసీ. మనం తినే ఆహారమే మనకు రక్ష. కానీ ఈ రోజుల్లో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారకాల వాడకం పెరిగిపోయింది” అని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం విక్రయించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని ఆసుపత్రులు కట్టినా, ప్రజల జీవనశైలిలో మార్పు రానంత వరకు సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం కాదని హితవు పలికారు.
