Site icon HashtagU Telugu

NTR Death Anniversary : ‘‘తెలుగు ప్రజలరా రండి. ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం’- బాబు

Ntr Vardanthi

Ntr Vardanthi

ఆంధ్రుల ఆత్మగౌరవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి (NTR Death Anniversary) నేడు. ఈ సందర్భంగా తెలుగు వాడి ఉనికిని ప్రపంచానికి పరిచయం చేసిన ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు అంటూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు , అభిమానులు , టీడీపీ శ్రేణులు ఇలా ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ (NTR) కు నివాళ్లు అర్పిస్తున్నారు.

తెలుగు భాషకు, తెలుగు వారికి ఓ గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్. నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి, తెలుగు సినీ పరిశ్రమను ఏలిన అనంతరం ప్రజలకోసం రాజకీయాల్లోకి వచ్చి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా వారి సమస్యలు తీరుస్తూ ఎంతోమందికి ఆరాధ్యదైవంలా మారారు. ఆయన మరణించి కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి ఆయన్ని తలుచుకుంటున్నామంటే ఆయన సాధించిన విజయాలు, చేసిన మంచి అలాంటిది.

ఎన్టీఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. ‘‘తెలుగు ప్రజలరా రండి. ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం. ఎన్టీఆర్‌కు అసలైన నివాళి అర్పించుదాం’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘‘బలహీన వర్గాల అణచివేత, పేదలను ఇంకా పేదలుగా మారుస్తున్న పాలన, సమాజంలో ఏ ఒక్కరికీ దక్కని భద్రతలతో తెలుగునేల అల్లాడుతున్న ఈ వేళ… తిరిగి రామరాజ్య స్థాపనకు ఎన్టీఆర్ స్ఫూర్తిగా మనందరం కదలాలి. అందుకే ‘తెలుగుదేశం పిలుస్తోంది రా… కదలిరా!’ అని ఆనాడు ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు స్ఫూర్తిగా నేను ‘రా… కదలిరా!’ అని పిలుపునిచ్చాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

‘‘ ఒకే ఒక జీవితం.. రెండు తిరుగులేని చరిత్రలు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతుబిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక నందమూరి తారక రామారావు గారు. తెలుగునాట నిరుపేదకు అలనాటి రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది… తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన తెలుగు వెలుగు ఎన్టీఆర్. పేదరికం లేని సమాజాన్ని, కులమతాలకు అతీతమైన సమసమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయడమే మన కర్తవ్యం కావాలి’’ టీడీపీ అధినేత ట్వీట్ చేశారు.

Read Also : TDP : జ‌గ‌న్‌కు దోపిడీపై ఉన్న శ్రద్ధ పెట్టుబడులపై ఎందుకు లేదు..?