CBN – Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసు విచారణ సందర్భంగా అవినీతి నిరోధక చట్టంలోని ‘సెక్షన్ 17-ఎ’పై సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా. ఎం త్రివేది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో వీరిద్దరూ చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విడివిడిగా తీర్పులను వెలువరించారు. గతంలో జరిగిన నేరాలకు 17ఏ వర్తించదని.. చట్ట సవరణ చేసిన తర్వాత నమోదైన కేసులకే 17ఏ వర్తిస్తుందని జస్టిస్ బేలా. ఎం త్రివేది పేర్కొన్నారు. చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని జస్టిస్ త్రివేది స్పష్టం చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఏపీ సీఐడీ తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలంటూ సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, హరీశ్ సాల్వే.. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసును జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించి అక్టోబరు 17న తీర్పును వాయిదా వేసింది. తాజాగా మంగళవారం ఆ తీర్పును(CBN – Supreme Court) వెలువరించింది.
We’re now on WhatsApp. Click to Join.
చంద్రబాబుపై నమోదు చేసిన కేసులు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధబోస్ తెలిపారు. చంద్రబాబుపై కేసుల్లో తగిన అనుమతులు లేకుండా ముందుకెళ్లారని ఆయన అభిప్రాయపడ్డారు. కేసుల నమోదుకు ముందు సీఐడీ తగిన అనుమతి తీసుకొని ఉండాల్సిందన్నారు. చట్టసవరణ చేసిన తర్వాత నమోదైన కేసులకే సెక్షన్ 17ఏ వర్తిస్తుందని జస్టిస్ త్రివేది చెప్పారు. చట్టసవరణకు ముందునాటికి ఉన్న కేసులకు 17ఏ వర్తించదన్నారు. నిజాయతీ గల పబ్లిక్ సర్వెంట్స్కు ఇబ్బంది ఉండకూడదనే 17ఏ చట్టసవరణ తెచ్చారని పేర్కొన్నారు. తగిన నిర్ణయం కోసం ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నివేదిస్తున్నామన్న ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. సెక్షన్ 17-ఎ అంశంతో ముడిపడిన ఫైబర్నెట్ కేసు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులలో చంద్రబాబుకు బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై ఈ నెల 17, 19వ తేదీల్లో సుప్రీంలో విచారణ జరగనుంది. ఈనేపథ్యంలో అంతకంటే ముందే 17-ఎపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తన నిర్ణయాన్ని వెలువరించడం గమనార్హం. హైకోర్టులో తాను వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి గతేడాది సెప్టెంబరు 22న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు అదే నెల 23న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.