తెలుగుదేశం పార్టీ టార్గెట్ 161 దిశగా స్కెచ్ వేసింది. ఆ దిశగా క్యాడర్ ను ముందుకు కదిలించే ప్రయత్నం మొదలు పెట్టంది. రాజకీయ వ్యూహకర్త రాబిన్ సింగ్ ఇచ్చిన నివేదికను బేస్ చేసుకుని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పొత్తు లేకుండా ఒంటరిగా వెళ్లడానికి మానసికంగా సిద్ధపడాలని సంకేతాలు ఇచ్చారు. కొన్ని నియోజకవర్గాల్లో మినహా 100 ప్లస్ స్థానాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినప్పటికీ గెలుపు ఖాయమనే సర్వే సారాంశాన్ని బయటపెట్టారు.
రాబోవు 16 నెలలు కష్టపడితే 161 స్థానాల్లో గెలుపు ఉంటుందని రాబిన్ సింగ్ ఇచ్చిన నివేదికను బేస్ చేసుకుని క్యాడర్ కు జోష్ నింపే ప్రయత్నం చేశారు. ఇక నుంచి ఇంటింటికి వెళ్లడం ద్వారా ప్రజల మధ్య ఉండాలని నాయకులు, క్యాడర్ కు. చంద్రబాబు పిలుపునిచ్చారు. `ఇదేం ఖర్మ` పేరుతో ఒక కార్యక్రమాన్ని టీడీపీ రూపొందించిన విషయాన్ని సమావేశంలో బయటపెట్టారు. ఆ తరువాత పేరును మార్చుతూ `ఇదేం ఖర్మ నా రాష్ట్రానికి` అంటూ మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకంటే మెరుగైన పేరును సూచిస్తూ మార్పు చేయడం ద్వారా కార్యక్రమాన్ని బలంగా ప్రజల మధ్యకు తీసుకెళ్లాలని ప్రణాళికను రూపొందించారు.
Also Read: Margadarsi Chit: జగన్ కు తండ్రి `మార్గదర్శి`నం! ఉండవల్లి సంబరం!!
ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల మధ్యకు యుద్ధ ప్రాతిపదికను తీసుకెళ్లాలని సూచించారు. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గాల వారీగా సమస్యలను గుర్తించి పోరాడేందుకు 45 రోజుల కార్యాచరణను చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ చేస్తోన్న అరాచకాలను బయటపెట్టాలని అన్నారు. రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి ఇదే చివరి ఎన్నికలు అనే విషయాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లాలని వివరించారు. ఈసారి పొరబాటున వైసీపీకి ఓటేస్తే ఇక రాష్ట్రాన్ని బాగుచేయలేమనే విషయాన్ని ప్రజలకు అవగాహన కలిగించాలని పేర్కొన్నారు. రాజకీయ వ్యూహకర్త ఇచ్చిన వ్యూహాన్ని యథాతదంగా అమలు చేయాలని సమావేశం తీర్మానించింది.
శనివారం ఉదయం నుంచి జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఒంటరిగా వెళ్లడానికి సిద్దం అవుతున్న కోణం నుంచి క్యాడర్ కు దిశానిర్దేశం చేయడం గమనార్హం. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ , పవన్ భేటీ తరువాత రాజకీయ ముఖచిత్రం టీడీపీకి అర్థం అయింది. అందుకే, ఒంటరి పోరాటం చేయడం ద్వారా సత్తా చాటాలని నిర్ణయం తీసుకుంది. టార్గెట్ 161 దిశగా పనిచేయాలని రాబిన్ సింగ్ ఇచ్చిన సర్వే సారాంశం ఆధారంగా చంద్రబాబు ప్రసంగం సాగింది. ఇదే సమయంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియా ముందుకొచ్చి టీడీపీ పొత్తుకు అవకాశం క్లోజ్ కాలేదని చెప్పడం విచిత్రం. మొత్తం మీద టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఆ పార్టీ క్యాడర్ కు క్లారిటీ ఇవ్వగా , జనసేనకు మాత్రం అంతర్గత ఆందోళన మొదలైనట్టు కనిపిస్తోంది.
Also Read: Kurnool Tour: చంద్రబాబు ఫుల్ జోష్! కర్నూలు బూస్టప్!!