Site icon HashtagU Telugu

Babu Love Story: చంద్ర‌బాబు `ల‌వ్` గేమ్‌

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడు `ల‌వ్‌` వ్య‌వ‌హారం పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వ‌న్ సైడ్ ల‌వ్ మంచిది కాద‌ని చిత్తూరు ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబు ఒక యువ‌కునికి చ‌మ‌త్కారంగా చెప్పాడు. టూ సైడ్ ల‌వ్ అయితేనే నిల‌బ‌డుతుంద‌ని టీడీపీ, జ‌నసేన పొత్తుపై న‌వ్వుతూ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఆ మాటలే ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌కు అస్త్రాలుగా మారిపోవ‌డం విశేషం. చిత్తూరు జిల్లా కుప్పం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబుకు జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకోవాల‌ని ఒక కార్య‌క‌ర్త చూచించాడు. ఆ సంద‌ర్భంగా ల‌వ్ గురించి చ‌మ‌త్క‌రించాడు. జ‌న‌సేన‌తో పొత్తు కావాల‌ని టీడీపీ భావిస్తోంది. కానీ, జ‌న‌సేన నుంచి అంతే స్పంద‌న రావ‌డంలేద‌ని ఆయ‌న చేసిన `వ‌న్ సైడ్ ల‌వ్ `మాట‌ల్లోని ఆంత‌ర్యం. స‌రిగ్గా, ఇదే అంశంపై బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు రియాక్ట్ అయ్యాడు. ఎవ‌రినైనా చంద్ర‌బాబు ల‌వ్ చేస్తాడ‌ని వ్యంగ్యాస్త్రాన్ని సంధించాడు. కానీ, ఎక్క‌డ వ‌దిలేస్తాడో..తెలియ‌ద‌ని సెటైర్ వేశాడు. కాంగ్రెస్ పార్టీని గ‌త ఎన్నిక‌ల్లో ల‌వ్ చేసిన చంద్ర‌బాబు ఇప్పుడు ఆ పార్టీని ఏం చేశాడో..చెప్పాల‌ని నిల‌దీశాడు.

2024 ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన క‌లిసి పోటీ చేస్తాయ‌ని మాన‌సికంగా ఏపీ ప్ర‌జ‌ల్ని ఆ పార్టీలు సిద్ధం చేస్తున్నాయి. అందుకు నిద‌ర్శ‌నంగా ఇటీవ‌ల జ‌రిగిన ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఆ రెండు పార్టీలు కొన్నిచోట్ల క‌లిసి ప‌నిచేశాయి. ప‌ర‌స్ప‌రం రాజ‌కీయ స‌హ‌కారం కూడా అందించుకుంటున్నాయి. ఇటీవ‌ల టీడీపీ ఆఫీస్ ల‌పై వైసీపీ క్యాడ‌ర్ దాడులు చేసింది. ఆ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్రంగా స్పందించాడు. జ‌న‌సేన‌తో పొత్తు ఉంటుంద‌ని పొలిట్ బ్యూరో మెంట‌ర్ ష‌రీఫ్ ఇటీవ‌ల ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో జ‌రిగిన ఒక స‌మావేశంలో వెల్ల‌డించాడు. మంగ‌ళ‌గిరి జ‌న‌సేన ఆఫీస్ లోకి టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ వెళ్లాడు.ఇవ‌న్నీ ఆ రెండు పార్టీలు పొత్తు దిశ‌గా అడుగులు వేస్తున్నాయ‌న‌డానికి సంకేతాలు.

ప్ర‌స్తుతం బీజేపీ, జ‌న‌సేన పొత్తు కొన‌సాగుతోంది. కానీ, ఇరు పార్టీలు క‌లిసి ఒకే వేదిక‌పైకి రాలేక‌పోతున్నాయి. తాజాగా జ‌రిగిన ప్ర‌జాగ్ర‌హ స‌భ‌కు జ‌న‌సేన దూరంగా ఉంది. బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ బీజేపీకి మ‌ద్ధ‌తు ఇవ్వ‌లేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణకు వ్య‌తిరేకంగా ప‌వ‌న్ చేసిన నిర‌స‌న కార్య‌క్ర‌మానికి బీజేపీ దూరంగా ఉంది. ఇలా..ఆ రెండుపార్టీలు ఢిల్లీ వేదిక‌గా ఒకేలా ఉన్న‌ప్ప‌టికీ ఏపీ కేంద్రంగా విభిన్నంగా ఉన్నాయి.
2019 ఎన్నిక‌ల్లో బీఎస్పీ, క‌మ్యూనిస్ట్ లతో క‌లిసి జ‌న‌సేన పోటీ చేసింది. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత ఆక‌స్మాత్తుగా లెఫ్ట్ నుంచి రైట్ వైపు ప‌వ‌న్ అడుగులు వేశాడు. కేంద్రంలోని బీజేపీ అజెండాను అందుకున్నాడు.కానీ, ఆయ‌న‌కు ఢిల్లీ పెద్ద‌ల నుంచి వ‌స్తోన్న స‌హ‌కారం అంతంత మాత్ర‌మే. దీంతో టీడీపీకి ద‌గ్గ‌ర కావాల‌ని ఆ పార్టీ అంత‌ర్గ‌తంగా భావిస్తోంది. బాహాటంగా టీడీపీ మాత్రం జ‌న‌సేన పొత్తును కోరుకుంటోంది. అందుకే, వ‌న్ సైడ్ ల‌వ్ వ‌ద్దంటూ చంద్ర‌బాబు చ‌మ‌త్క‌రించాడు. ఈ ల‌వ్ వ్య‌వ‌హారాన్ని ప్ర‌త్య‌ర్థులు ఎక్క‌డి వ‌ర‌కు తీసుకెళ‌తారో..చూద్దాం.!