Chandrababu : అత్తారింటికి చంద్ర‌బాబు!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు అత్తారింటికి వెళ్ల‌బోతున్నారు. ఈనెల 29వ తేదీన అక్క‌డే బ‌స చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - June 24, 2022 / 10:15 AM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు అత్తారింటికి వెళ్ల‌బోతున్నారు. ఈనెల 29వ తేదీన అక్క‌డే బ‌స చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ స్వ‌గ్రామం నిమ్మ‌కూరు ఆయ‌న కోసం ముస్తాబవుతోంది. ఇంత‌కీ ఎందు కోసం? ఆయ‌న పెళ్లి చేసుకుని కొన్ని ద‌శాబ్దాలు గ‌డిచిన త‌రువాత ఇప్పుడు అత్తారింటికి ఏంటి? అనుకుంటున్నారా? అప్పుడేమో కొత్త‌ల్లుడిగా వెళ్లి ఉంటారు. ఇప్పుడేమో రాజ‌కీయ వ్యూహాలు ప‌న్న‌డానికి నిమ్మ‌కూరు వెళుతున్నారు.

గుడివాడ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో నిమ్మ‌కూరు ఉంది. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి తెలుగుదేశం పార్టీ కంచుకోట‌గా ఆ నియోజ‌క‌వ‌ర్గం ఉండేది. కానీ, 2014, 2019 ఎన్నిక‌ల్లో కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని వైసీపీ త‌ర‌పున గెలుపొందారు. అంత‌కంటే ముందు 2009, 2004 ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన నాని పార్టీ మార‌డంతో తెలుగుదేశం పార్టీ వెనుక‌బ‌డింది. అక్క‌డ టీడీపీ ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉంటారు. అంతేకాదు, నంద‌మూరి ఫ్యామిలీ ప్ర‌భావం కూడా ఎక్కువ‌గా ఉంటుంది. అందుకే, 1983 నుంచి టీడీపీ గెలుస్తూ వ‌చ్చింది. తొలుత ఎన్టీఆర్ అక్క‌డి నుంచే పోటీ చేసి గెలుపొందారు. అదే ఆన‌వాయితీ కొన‌సాగుతూ వ‌చ్చింది. దాన్ని బ్రేక్ చేసిన లీడ‌ర్ కొడాలి నాని. ఆయ‌న్ను టార్గెట్ చేయ‌డం ఇప్పుడు చంద్ర‌బాబు ముందున్న ఛాలెంజ్‌.

ఇటీవ‌ల మాజీ మంత్రి కొడాలి నాని ప‌లు సంద‌ర్భాల్లో నారా కుటుంబాన్ని రాజ‌కీయంగా టార్గెట్ చేస్తూ ర‌చ్చ చేశారు. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు కూడా దిగారు. రాజ‌కీయ జీవితాన్ని ఉద‌హ‌రిస్తూ ప‌లుమార్లు చంద్ర‌బాబును వ్య‌క్తిగ‌తంగా దుర్భాష‌లాడారు. ద‌మ్ముంటే గుడివాడ‌లో ఓడించాల‌ని స‌వాల్ విసిరారు. తండ్రీకొడుకులు ఇద్ద‌రూ వ‌చ్చినా చిటికెన వేలు మీద వెంట్రుక కూడా పీక‌లేర‌ని కొడాలి రెచ్చ‌గొట్టారు. ఆనాటి నుంచి చంద్ర‌బాబు సమ‌యం కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి కొడాలి, వ‌ల్ల‌భ‌నేని వంశీల‌ను ఎలాగైన చిత్తుగా ఓడించాల‌ని టీడీపీ కృష్ణా జిల్లా విభాగం వ్యూహాల‌ను ర‌చిస్తోంది. దానికి చంద్ర‌బాబు ప‌దును పెడుతున్నారు. ఇప్ప‌టికే వంగ‌వీటి రాధ ఒక‌టి రెండు సంద‌ర్భాల్లో గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. బ‌హుశా చంద్ర‌బాబుకు తెలియ‌కుండా ఆయ‌న వెళ్లి ఉండ‌రు. ఆయ‌న్ను అస్త్రంగా ఉప‌యోగించ‌డం ద్వారా కొడాలిని దెబ్బ‌తీయాల‌ని బాబు ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.

ఏపీ వ్యాప్తంగా ప్ర‌తి వారం కొత్త జిల్లాల వారీగా ప‌ర్య‌టిస్తోన్న చంద్ర‌బాబు ఈసారి కృష్ణా జిల్లా ప‌ర్య‌ట‌న పెట్టుకున్నారు. ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్రాంతాల్లో నిర్వ‌హించిన మినీ మ‌హానాడులు అనూహ్యంగా విజ‌య‌వంతం అయ్యాయి. ఒంగోలు మ‌హానాడు సూప‌ర్ హిట్ త‌రువాత క్యాడ‌ర్ లోనూ నూత‌నోత్సాహం క‌నిపిస్తోంది. అదే ఉత్సాహాన్ని కొన‌సాగిస్తూ మినీ మ‌హానాడుల‌కు జిల్లాల వారీగా బాబు వెళుతున్నారు. తొలి రోజు భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌డం, రెండో రోజు జిల్లాలోని నియోజ‌క‌వ‌ర్గాల నేత‌ల‌తో స‌మీక్ష , మూడో రోజు రోడ్ షోలు పెడుతున్నారు. ఇదే పంథాలో కృష్ణా జిల్లాకు వెళ్ల‌నున్న ఆయ‌న కొడాలి మ‌రోసారి నోరెత్త‌కుండా ఉండేలా కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌వంతం చేయ‌డానికి రూట్ మ్యాప్ త‌యారు అయింది. కృష్ణా జిల్లా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా రోడ్ షో ముగిసిన త‌రువాత చంద్ర‌బాబు అత్త‌గారింట బ‌స చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.