Chadalavada Aravinda Babu పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
వివరాల్లోకి వెళితే… నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు పల్నాడు ఎస్పీ కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు బైఠాయించడం వివాదానికి కేంద్రబిందువైంది. జిల్లా పోలీస్ సెల్ న్యాయ సలహాదారుగా తాను సిఫారసు చేసిన రామినేని ప్రసాద్ పేరును ఎందుకు ఆమోదించలేదని ఎస్పీ బి.కృష్ణారావును అరవిందబాబు నిలదీశారు. ఎస్పీ వివరణ ఇచ్చినా వినకుండా, నియామక ఉత్తర్వుల కాపీ చేతికి వచ్చేవరకు కదిలేది లేదని ఎస్పీ ఛాంబర్లోనే కూర్చున్నారు. మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత కార్యాలయాల నుంచి ఫోన్లు వచ్చినా ఎమ్మెల్యే తన పంతం వీడకపోవడం చర్చనీయాంశమైంది.
ఈ వ్యవహారంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. “వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ గౌరవాన్ని పణంగా పెట్టేది లేదు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే పునరాలోచన లేకుండా సస్పెండ్ చేస్తా. రాజకీయాల్లో సుదీర్ఘ కాలం ఉండాలనుకుంటున్నారా? లేక ఒక్కసారే ఎమ్మెల్యేలుగా మిగిలిపోవాలనుకుంటున్నారా? మీరే తేల్చుకోవాలి” అంటూ హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తేవడం, కార్యాలయాల్లో బైఠాయించడం వంటి చర్యలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తాయని, ఇలాంటి వాటిని భరించే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
