నారా లోకేష్ (Nara Lokesh) ‘‘యువగళం’’ పాదయాత్ర 29 వ రోజు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మామండూరులో రజక సామాజికవర్గం ప్రతినిధులతో నారా లోకేశ్ ‘‘ముఖాముఖి’’ భేటీ అయ్యారు. ‘‘దోబీ ఘాట్స్ లేవు… ఉన్న చోట కూడా కనీస వసతుల్లేక మహిళలు ఇబ్బందులు పడ్తున్నారు. కనీసం మధ్యాహ్న భోజనం చెయ్యడానికి కూడా నీడ లేదు..దోబీ ఘాట్స్ కి కరెంటు బిల్లుల బాదుడు భరించలేక పోతున్నాం, బిల్లులు కట్టాలని జగన్ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక పోతున్నాం..దోబి ఘాట్స్ ని కూడా వైసిపి నేతలు వదలడం లేదు.. ప్రతిచోటా కబ్జాలే. చెరువుల్లో బట్టలు ఉతకడానికి వీల్లేదని దౌర్జన్యాలు చేస్తున్నారని’’ ఆవేదన చెందారు.
దేవాలయాలు, ఆసుపత్రుల్లో దుస్తులుతికే కాంట్రాక్టులు కూడా రజకులకివ్వకుండా వైసిపి వాళ్లే చేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. పొరుగు రాష్ట్రాల్లో తాము ఎస్సీలు గా ఉన్నామంటూ, ఇక్కడ కూడా రజకులను ఎస్సీ ల్లో చేర్చాలని కోరారు. మునిరాజమ్మ మాట్లాడుతూ, ‘‘ ఏ తప్పు చేయని తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు (Police case) పెట్టారని, ప్రాణాలు పోయినా మధుసూదన్ రెడ్డికి క్షమాపణ చెప్పేది లేదని’’ ‘‘ఇళ్లు కూల్చేస్తే చెట్టు కింద బ్రతుకుతామంటూ వైసిపి వాళ్లకు అణగిమణిగి ఉండే ప్రసక్తే లేదని’’ పేర్కొంది.
నారా లోకేష్ (Nara Lokesh) మాట్లాడుతూ, ‘‘రజక సామాజిక వర్గానికి చెందిన ముని రాజమ్మకి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే, ‘‘రజకుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తాం. బడుగు బలహీన వర్గాల రక్షణ కోసం ప్రత్యేక చట్టం రూపొందిస్తాం. రజక భవనాలు నిర్మిస్తాం. అన్ని సౌకర్యాలతో దోబి ఘాట్స్ ఏర్పాటు చేస్తాం. ఉచితంగా విద్యుత్ అందిస్తాం. తిరుమల తో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో బట్టలు ఉతికే రజకులకు టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే కాంట్రాక్టులు ఇస్తామని’’ నారా లోకేశ్ (Nara Lokesh) హామీ ఇచ్చారు.
Also Read: NTR’s Coin: ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణెం ఇదే!