TDP : 42వ వసంతంలోకి టీడీపీ..పార్టీ శ్రేణులకు చంద్రబాబు శుభాకాంక్షలు

  • Written By:
  • Publish Date - March 29, 2024 / 12:33 PM IST

TDP Formation Day Celebrations: తెలుగుదేశం పార్టీ(TDP) నేడు 42వ వసంతంలోకి అడుగు పెట్టింది. తెలుగు జాతి కీర్తి పతాకాల్ని- తెలుగువాడి ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎగరేసిన ఈ పార్టీ, ‘తెలుగు దేశం పిలుస్తోంది, రా కదలిరా’ అంటూ అన్న నందమూరి తారకరామారావు(Nandamuri Taraka Rama Rao) పిలుపుతో 1982 మార్చి 29వ తేదీన పురుడు పోసుకుంది. ఎన్నో చారిత్రక ఘట్టాలకూ, సవాళ్లూ, సంక్షోభాలకు కేంద్ర బిందువుగా నిలిచింది.

We’re now on WhatsApp. Click to Join.

రాజకీయ పార్టీల ఎత్తుగడల్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ, సవాళ్లను సమర్థంగా అధిగమిస్తూ, ఎన్ని ఇబ్బందులు తలెత్తినా పోరాట పంథానే కొనసాగిస్తోంది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల మధ్యే, ప్రజలతోనే మమేకమవటం తెలుగుదేశం పంథా. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసి నవ్యాంధ్రలో తిరిగి అధికారం చేజిక్కించుకునే దిశగా తెలుగుదేశం పావులు కదుపుతోంది.

Read Also: Tollywood: మరోసారి భార్యతో కలిసి సమ్మర్ వెకేషన్ కు రెడీ అయిన చిరంజీవి?

తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) శుభాకాంక్షలు తెలిపారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, జ్యోతిబా ఫూలే వంటి మహాశయుల స్ఫూర్తిగా 1982లో ఇదే రోజున ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించారని చంద్రబాబు గుర్తు చేశారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని, ప్రజలకు సేవ చేయడం అంటూ దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పారని ఆయన కొనియాడారు.

బడుగు, బలహీన వర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్లాలి అంటూ ఇటు పార్టీలోనూ, అటు పాలనలోనూ పదవులు ఇచ్చారని తెలిపారు. ఆనాటి నుంచి నేటి వరకు తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా తెలుగు ప్రజల సేవలో పార్టీ నిమగ్నమై ఉందని పేర్కొన్నారు. ఇక ముందు కూడా ఇదే అంకితభావంతో తెలుగు ప్రజల బంగారు భవిష్యత్తుకు కృషి చేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

తెలుగు ప్రజ‌ల ఆత్మగౌర‌వం కోసం పుట్టింది తెలుగుదేశమని లోకేశ్ స్పష్టం చేశారు. అణ‌గారిన‌ వ‌ర్గాల‌కు అండ‌గా నిలిచింది ప‌సుపు జెండా అని పేర్కొన్నారు. స‌మాజ‌మే దేవాల‌యం- ప్రజ‌లే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ ఆశ‌య‌ సాధ‌న‌, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తున్నామని లోకేశ్ కొనియాడారు.

Read Also: Anupama Parameswaran: నా తమ్ముడిని బామ్మర్ది అంటూ మెసేజ్ లు చేస్తున్నారు: అనుపమ

ఉండవల్లిలోని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో కలిసి నారా భువనేశ్వరి కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్ చిత్రపటానికి భువనేశ్వరి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ కార్యక్రమంలో పాల్గొన్నారు.