AP Special Status : ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్న డిమాండ్ పై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌త్యేక హోదా గురించి ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అడిగిన మాట వాస్త‌మేన‌ని కేంద్ర ఆర్థికశాఖ స‌హాయ మంత్రి పంకజ్ చౌదురి తెలిపారు.

  • Written By:
  • Publish Date - December 22, 2021 / 02:20 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్న డిమాండ్ పై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌త్యేక హోదా గురించి ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అడిగిన మాట వాస్త‌మేన‌ని కేంద్ర ఆర్థికశాఖ స‌హాయ మంత్రి పంకజ్ చౌదురి తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కోరడం వల్లే ప్రత్యేక హోదాకు బదులుగానే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల నీతి ఆయోగ్‌తో జరిపిన సమావేశంలో విజ్ఞప్తి చేసిన విషయం వాస్తవమేనని ఆయన పేర్కొన్నారు.

ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 90 శాతం కేంద్రం వాటా, 10 శాతం రాష్ట్ర వాటా ఉంటుందని ఆయన తెలిపారు. ఆ మేరకు పొందే ఆర్థిక ప్రయోజనాలను ప్రత్యేక ఆర్థిక సహాయం కింద ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరిన దరిమిలా రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని ఆయన చెప్పారు. విభజన చట్టం హామీలు నెరవేర్చే బాధ్యత తమదేనని కేంద్ర మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు సాయం అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఏపీకి 2015- 19 మధ్య ప్రత్యేక ఆర్థిక సహాయం అందించామని.. ఏపీ ఎక్స్‌టర్నల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్టులకు రుణం సమకూర్చినట్లు వెల్లడించారు. ఎక్స్‌టర్నల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్టుల రుణంపై వడ్డీ కడుతున్నట్లు పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.19,846 కోట్లు, రెవెన్యూ లోటు గ్రాంటు కింద రూ.22,112 కోట్లు అందించినట్లు వివరించారు. 2020-21లో ఏపీకి రూ. 5,897 కోట్లు ఇచ్చామని కేంద్ర మంత్రి పంకజ్‌ చౌధరి వివరించారు.