CBN IIIT Celebration : `మంచోళ్లకు రోజులు కాదు ఇవి..` అంటారు పెద్దలు. ఆ నానుడిని చంద్రబాబుకు వర్తింప చేస్తే, సరిగ్గా సరిపోతుంది. తెలంగాణ సమాజానికి బంగారు సిరులను అందించిన చంద్రబాబుకు రాజకీయంగా అక్కడ స్థానం లేకుండా పోయింది. ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు తయారు చేసిన విజన్ ఇప్పుడు సిరులను కురిపిస్తోంది. ఎకరం రూ. 100కోట్లు పలుకుతుందంటే, ప్రస్తుతం సీఎం కేసీఆర్ చతురత కొంత మాత్రమే. రెండున్నర దశాబ్దం క్రితం చంద్రబాబు వేసిన విజన్ 2020 పునాదులు ఇప్పుడు కోట్లను కురిపిస్తున్నాయని నిస్వార్థంగా ఆలోచిస్తే అర్థమవుతుంది.
హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలిపిన చంద్రబాబుకు 2014 ఎన్నికల్లో ఎందుకు ప్రజలు మద్ధతు పలకలేదు? అనేది తరచూ వినిపించే ప్రశ్న. అంతేకాదు, తెలంగాణ ప్రజలు ఎందుకు ఆయన్ను ఆదరించకుండా పంపారు? అంటూ ప్రత్యర్థులు నిలదీస్తుంటారు. దానికి ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో (CBN IIIT Celebration) చంద్రబాబు సమాధానం ఇచ్చారు. అక్కడి స్టూడెంట్స్ తో ముఖాముఖి మాట్లాడిన సందర్భంగా అభివృద్ధి వేరు , రాజకీయం వేరని విశదీకరించారు. రాజకీయాలకు, అభివృద్ధికి ముడిపెట్టొద్దని చెప్పడం గమనార్హం.
Also Read : CBN Strength : కాంగ్రెస్ వైపు చంద్రబాబు శిష్యులు
రెండున్నర దశాబ్దం క్రితం విజన్ 2020 తయారు చేసిన చంద్రబాబు ఫక్తు రాజకీయాలు చేయలేదు. అభివృద్ధి దిశగా పరుగులు పెట్టారు. ఆయన నిద్రపోకుండా, అధికారులను నిద్రపోనివ్వకుండా ప్రగతి కలలు కన్నారు. సొంత కుటుంబీకులను కూడా పెద్దగా పట్టించుకోలేదు. తల్లి మరణించిన సందర్భంగా అంత్యక్రియలకు కూడా సరైన సమయంలో వెళ్లలేదని చంద్రబాబు మీద ఉన్న ప్రధాన విమర్శ. అసెంబ్లీ లోపల, వెలుపల పలుమార్లు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇదే విమర్శలను పలుమార్లు చేశారు. వాస్తవంగా చంద్రబాబు తల్లి చనిపోయిన రోజు సమీక్ష సమావేశాల్లో ఆయన మునిగితేలుతూ కీర్తి అనే మాయలో ఉండిపోయారు. అందుకే, సొంత కుటుంబీకులకు కూడా సమయం ఇవ్వకుండా రాష్ట్రం అభివృద్ధి కోసం శ్రమించారు.
Also Read : CBN High Tech : ట్రిపుల్ ఐటీ ఉత్సవాలకు చంద్రబాబు, విజన్ 2020 ఫలం
పలుమార్లు శ్రేయోభిలాషులు అభివృద్ధి, రాజకీయాలు వేరని చంద్రబాబుకు చెప్పారు. కానీ, ఎన్నికలప్పుడే రాజకీయాలంటూ ప్రగతి దిశగా పరుగులు పెట్టారు. పార్టీని, క్యాడర్ ను పెద్దగా పట్టించుకోలేదు. రాజకీయాల్లో మార్పులు తీసుకురావడానికి తటస్తులంటూ 2004 ఎన్నికల్లో ప్రయోగం చేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్లను చాలా మంది లీడర్లను ఆ ఎన్నికల్లో దూరంగా పెట్టారు. అంతేకాదు, ఐఏఎస్, ఐపీఎస్ లకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు వాళ్ల మీద ఆధారపడే పరిస్థితి ఉండేది.
సీన్ కట్ చేస్తే, 2004 ఎన్నికల్లో ఘోరంగా టీడీపీ ఓడిపోయింది. హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి చేసినప్పటికీ అక్కడి ప్రజలు కూడా ఆదరించలేదు. అదే ఏపీ విషయంలోనూ 2019 ఎన్నికల్లో రిపీట్ అయింది. అమరావతి రాజధాని పరిధిలోనూ టీడీపీ గెలవలేదు. రెండున్నర దశాబ్దాల తరువాత తత్త్వం ఆయనకు బోధపడింది. శ్రేయోభిలాషులు 20ఏళ్ల క్రితం మొత్తుకున్న విధంగా అభివృద్ధి చేయడం వేరు, రాజకీయాలు వేరని ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో (CBN IIIT Celebration) చంద్రబాబు చెప్పడం గమనార్హం.
ఫక్తు రాజకీయాలు అంటే ఏమిటో చంద్రబాబు ఇప్పుడు రుచిచూస్తున్నారు. కేంద్రంలో మోడీ, తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఎలా చేస్తున్నారో బోధపడింది. విజన్ 2020తో హైదరాబాద్ ను ప్రపంచ వ్యాప్తం చేసిన చంద్రబాబును తొలి నుంచి కేసీఆర్ దొంగలా చూశారు. తెలంగాణ సమాజానికి విలన్ మాదిరిగా చూపించగలిగారు. ఫక్తు రాజకీయాలతో తెలంగాణ సమాజానికి టీడీపీని దూరంగా పెట్టగలిగారు. పటేల్ , పట్వారీ వ్యవస్థ నుంచి విముక్తి చేసిన వెనుకబడిన వర్గాలు కూడా టీడీపీని కాదని కేసీఆర్ పక్షాన చేరిపోయారు. ఇక ఏపీ రాజకీయ ఎపిసోడ్ కూడా ఇంచుమించు అలాగే ఉంది. రాజధాని అమరావతిని అభివృద్ధి చేసిన చంద్రబాబును కాదని జగన్మోహన్ రెడ్డి పక్షాన నిలిచారు. అభివృద్ధి వేరు, రాజకీయాలు వేరని అక్కడి ప్రజలు ఆయనకు కళ్లు తెరిపించారు.
అభివృద్ధి, ప్రగతి అంటూ బోల్డ్ గా సమాజం గురించి చంద్రబాబు ఆలోచించారు. భవిష్యత్ తరాలు గుర్తించుకోవాలని తపన పడ్డారు. రాజకీయ విమర్శలకు కూడా భయపడుతూ పరిపాలన సాగించిన ఆయన ఫక్తు రాజకీయాలను ఎప్పుడూ చేయలేకపోయారు. లేదంటే, కేసీఆర్, వైఎస్ ఎప్పుడో రాజకీయంగా క్లోజ్ అయ్యే వాళ్లను టీడీపీలోని కోర్ టీమ్ అభిప్రాయం. రాజకీయ ప్రత్యర్థుల మీద ఏసీబీ, సీఐడీ లను దుర్వినియోగం చేయలేదని గుర్తు చేస్తున్నారు. ఫక్తు రాజకీయాలను చేసి ఉంటే, కొత్త పార్టీలు పుట్టేవి కాదని ఇప్పుడు టీడీపీ అవలోకన చేసుకుంటుంది. అందుకే, మంచోళ్లకు రోజులు కాదని పెద్దలు చెప్పినట్టు అభివృద్ధి చేసే నాయకులకు రోజులు కాదు. ఫక్తు రాజకీయాలు చేసే వాళ్లకు రోజులివి. ఆ విషయాన్ని చంద్రబాబు ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో (CBN IIIT Celebration) చెప్పడం టీడీపీ క్యాడర్ కు సంతోషం కలిగిస్తోంది. ఇప్పటికైనా తమ అధినేత ఆలోచన మారిందని సంబరపడుతున్నారు. కానీ, చేతులు కాలాక, ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏమిటి? అనేది ప్రశ్న.