YS Avinash Reddy: వివేకా హంతకుడు ఎంపీ అవినాశ్ రెడ్డి అంటూ వైఎస్ షర్మిల చేస్తున్న తీవ్ర వ్యాఖ్యల పట్ల ఎంపీ అవినాశ్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. ఆమె మాట్లాడుతున్న మాటలు వినడానికి భయంకరంగా ఉన్నాయని అన్నారు. ఆ మాటలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. మసి పూస్తారు, బురద చల్లుతారు… వాళ్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు… వాళ్ల విచక్షణకే వదిలేస్తున్నా… దీని గురించి ఎక్కువగా చర్చించాల్సిన అవసరం కూడా లేదు అని అవినాశ్ రెడ్డి స్పష్టం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఎంత మాట్లాడుకోవాలంటే అంత మాట్లాడుకోండి… నాకెలాంటి అభ్యంతరం లేదు… కానీ మనిషిగా పుట్టాక కొంచెమైనా విజ్ఞత, విచక్షణ ఉండాలి… కొంచెమైనా ఇంగితజ్ఞానం ఉండాలి అంటూ హితవు పలికారు.
కాగా, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఒక్క రోజు కూడా కడప స్టీల్ మీద మాట్లాడలేదని షర్మిల విమర్శించారు. వివేకా కేసులో నిందితుడిగా అవినాష్ రెడ్డి మీద ముద్ర వేసిందని గుర్తు చేశారు. నిందితుడిగా ఉన్న అవినాష్రెడ్డికి మళ్లీ ఎలా టిక్కెట్ ఇచ్చారని జగన్ను షర్మిల ప్రశ్నించారు. బాబాయి హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని షర్మిల నిలదీశారు. ఎందుకు అసలు నిజం దాచి పెడుతున్నారని ప్రశ్నించారు. సీబీఐ విచారణ ఎందుకు వద్దన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు నేరం చేయక పోతే విచారణకు ఎందుకు అడ్డుపడుతున్నారన్నారు. ఈ ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలన్నారు. హత్యారాజకీయాలు ప్రోత్సహించే వారికి బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సీబీఐ నిందితుడు అని చెప్తున్న అవినాష్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వడం వల్లే కడప నుంచి తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. కడప ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆశీర్వదించాలని షర్మిల విజ్ఞప్తి చేశారు.