దసరాకు ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. దసర రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాల నుంచి 5,500 స్పెషల్ బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. దసరా పండుగకు దూరప్రాంతాల నుంచి విజయవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు వస్తారు. అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు తమ సొంతూళ్లకు వెళ్తారు కాబట్టి ఆర్టీసీ అదనపు బస్సులను ఏర్పాటు చేస్తుంది. తెలంగాణ, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల నుండి వచ్చే ప్రయాణికులకు కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపతుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. దసరా పండుగ ముందు, తర్వాత రోజులలో రద్దీని దృష్టిలో పెట్టుకుని 13.10.2023 నుండి 26.10.2023 వరకు మొత్తం 5,500 బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
సాధారణ రోజుల్లో APSRTC అనేక సర్వీసులతో బస్సులను నడుపుతుంది. కాగా, ఈ పండుగ రోజులలో అదనంగా హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి పొరుగు రాష్ట్రాలకు మరియు రాష్ట్రంలోని మఖ్యపట్టణాలు, నగరాలకు, ప్రాంతాలకు అనగా విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, బెంగుళురు, చెన్నై, తిరుపతి, అనంతపురం, విజయనగరం, కాకినాడ, భీమవరం, అమలాపురం, కడప, భద్రాచలం, శ్రీశైలం, మార్కాపురం, ఒంగోలు, తుని, శ్రీకాకుళం, నెల్లూరులకు ఈ 5,500 ప్రత్యేక బస్సులు నడపబడతాయి. 13.10.2023 నుండి 22.10.2023 వరకు (దసరా ముందు రోజులలో) -2,700 బస్సులు.. 23.10.2023 నుండి 26.10.2023 వరకు ( దసరా తర్వాత రోజులలో ) -2,800 బస్సులు నడపనున్నారు
హైదరాబాద్ నుండి 2,050 బస్సులు, బెంగుళూరు నుండి 440 బస్సులు, చెన్నై నుండి 153 బస్సులు వివిధ పట్టణాలకు నడపబడతాయి. విశాఖపట్నం నుండి 480 బస్సులు, రాజమండ్రి నుండి 355 బస్సులు, విజయవాడ నుండి 885 బస్సులు, అదే విధంగా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి వివిధ ప్రాంతాలకు/ పల్లెలకు/ నగరాలకు 1,137 ప్రత్యేక బస్సుల కేటాయింపుతో రద్దీని తట్టుకునే విధంగా ఏర్పాటు చేయబడ్డాయి. ప్రయాణికులపై భారం మోపకూడదనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ సారి కూడా సాధారణ ఛార్జీలతోనే ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ లెలిపింది. ఈ పండుగ నవరాత్రులలో విజయవాడ కనక దుర్గ గుడికి ఎక్కువ మంది భవానీలు వచ్చే అవకాశం ఉన్నందున వారి రద్దీని బట్టి బస్సులు నడిపేందుకు ప్రణాళికలు చేసింది.
కళాశాలలకు, పాఠశాలలకు, వరుస సెలవులు మరియు ఉద్యోగులకు వరుస సెలవులు కారణంగా ప్రయాణ అవసరాలు ఎక్కువగా ఉంటాయి. స్వస్థలాలకు రావడానికి, తిరిగి వెళ్ళడానికి APSRTC బస్సుల మీద ప్రయాణికులు ఎక్కువగా ఆధారపడతారు. ఈ కారణంగా అన్ని జిల్లాల నుండి విజయవాడకు 885 బస్సులు నడిపి రవాణా సేవలు అందించేందుకు సిద్దంగా ఉందని APSRTC తెలిపింది. అంతేకాకుండా APSRTC లో కొత్తగా ప్రవేశ పెట్టిన UTS మెషీన్ల వలన ఈసారి చిల్లర సమస్య అనే ప్రస్తావనకు అవకాశం లేదు. ప్రయాణికులు చాలా సులభంగా ఫోన్ పే, గూగుల్ పే, QR కోడ్ స్కాన్ చేయడం, క్రెడిట్, డెబిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా కూడా టిక్కెట్లు తీసుకుని ప్రయాణం సాగించే వీలుంది. ముందస్తుగా సీటు వివరాలు చెక్ చేసుకుని బస్సులను ఎంచుకునే అవకాశం కూడా ఉండడంతో ఈసారి ప్రయాణీకులకు మరింత సేవలు అందించడానికి APSRTC కృషి చేస్తుంది. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఇబ్బందులకు తావివ్వకుండా కూడా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వనుంది.