ఏపీలో స్కూల్స్ విలీనం రాజకీయాన్ని సంతరించుకుంది. అశాస్త్రీయంగా చేసిన విలీనం కొన్ని గ్రామాల ప్రజలకు ఆగ్రహం కలిగిస్తోంది. అందుకే, విలీనం ప్రక్రియను ఏపీ సర్కార్ మరోసారి పరిశీలిస్తోంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యేల నుంచి వచ్చిన 820 అభ్యంతరాలను అధ్యయనం చేస్తోంది. ఒక వేళ విలీనం ఇబ్బంది కలిగేలా ఉంటే ఆపేయడానికి సిద్ధంగా ఉన్నామని విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ వెల్లడించారు.
ప్రాథమిక స్థాయిలో తరగతుల విలీనం జరుగుతోంది. కానీ, పాఠశాలల విలీనం జరగడంలేదని అధికారులు చెబుతున్నారు. “ విద్యార్థుల ప్రయోజనాల కోసమే తరగతుల విలీనాన్ని చేపడుతున్నాం” అంటూ రాజశేఖర్ వివరించారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోలేని మీడియాలోని ఒక వర్గం తప్పుడు ప్రచారం చేస్తుందని విద్యాశాఖ అధికారులు ఫైర్ అవుతున్నారు.
Also Read: Rachana Reddy Joined BJP: బీజేపీ లో చేరిన రచనా రెడ్డి
అంగన్వాడీ పిల్లలకు ఉద్దేశించిన ప్రీ-నర్సరీ తరగతులను I, II తరగతులలో విలీనం చేసి PP-1 మరియు PP-2 పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా సబ్జెక్టు ఉపాధ్యాయులు తరగతులు తీసుకునేలా III నుంచి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. 2021-22 విద్యా సంవత్సరంలో 2,943 ప్రాథమిక పాఠశాలలను 250 మీటర్ల దూరంలో ఉన్న 2,800 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసినట్లు సీనియర్ విద్యాశాఖ అధికారి తెలిపారు. 2022-23లో, 620 ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న 4,954 పాఠశాలలుగా విలీనం చేయబడ్డాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,870 పాఠశాలలు విలీనం అయ్యాయి.
ఉపాధ్యాయ పోస్టుల రద్దు ఉండదని ఏపీ సర్కార్ చెబుతోంది. 8,232 మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించగా, పెద్ద సంఖ్యలో స్కూల్ హెడ్ల పోస్టులు మంజూరయ్యాయి. ఉపాధ్యాయులెవరికీ అన్యాయం జరగకూడదని, గత రెండున్నరేళ్లలో 15,715 పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమాన్ని అమలు చేశారు. ఈ ఏడాది 32,000 అదనపు తరగతి గదుల నిర్మాణానికి కృషి చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద స్కూల్స్ విలీనం ఏపీ వ్యాప్తంగా రాజకీయ రాద్ధాంతం జరుగుతుండగా, అధికారులు మాత్రం ఒక వర్గం మీడియా ఉద్దేశ పూర్వకంగా దుష్ర్పచారం చేస్తోందని అధికారులు ఫైర్ కావడం గమనార్హం.
Also Read: Operation Akarsh: ఢిల్లీ ఆపరేషన్ షురూ