AP Government : ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించట్లేదు.. హైకోర్టులో ఏపీ ప్రభుత్వం.. వైజాగ్ రాజధాని చేయట్లేదా?

వైజాగ్ కు రాజధాని ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రైతు పరిరక్షణ సమితి నేతలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

Published By: HashtagU Telugu Desk
AP Government Sensational Comments on Capital Offices Movement to Vizag in High Court

AP Government Sensational Comments on Capital Offices Movement to Vizag in High Court

ఏపీ(AP) రాజధాని అమరావతి(Amaravati) అని చంద్రబాబు పనులు మొదలుపెట్టినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానులు అంటూ హడావిడి చేసి అమరావతిలో పనులు ఆపేశారు. మూడు రాజధానులు అని బాగా ప్రచారం చేశారు వైసీపీ నాయకులు. వైజాగ్(Vizag) లో కొన్ని కట్టడాలు మొదలుపెట్టినా అమరావతి, కర్నూల్ ని మాత్రం పట్టించుకోలేదు.

దీంతో వైసీపీ(YCP) ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇటీవలే కేంద్రం కూడా ఏపీకి అమరావతే రాజధాని అని స్పష్టం చేసింది. ఇక ఏపీ రాజధాని విషయంలో కోర్టుల్లో పలు కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఇటీవల వైజాగ్ కి త్వరలో రాజధాని షిఫ్ట్ అవుతుందని, సీఎం జగన్ కూడా పరిపాలన అక్కడనుంచే చేస్తారని వైసీపీ మంత్రులు వ్యాఖ్యానించారు.

అయితే వైజాగ్ కు రాజధాని ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రైతు పరిరక్షణ సమితి నేతలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నేడు హైకోర్టులో ఈ పిటిషన్స్ పై విచారణ జరిగింది. దీనికి హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో రాజధాని కార్యాలయాలను విశాఖకు ప్రస్తుతం తరలించడం లేదు, కార్యాలయాలు తరలిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అపోహ మాత్రమే అని హైకోర్టులో అఫిడవిట్ లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ పిటీషన్ ను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని రిజిస్ట్రీలో అప్లికేషన్ ఇచ్చినట్లు ప్రభుత్వ న్యాయవాది కోరారు. కేసు విచారణను వాయిదా వేయాలని కోరడంతో హైకోర్టు ఈ కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అయితే హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ ఇప్పుడు సంచలనంగా మారింది.

Also Read : CM Jagan: ఈ నెల 14న సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన

ఇన్నాళ్లు వైజాగ్ రాజధాని అని వైసీపీ నాయకులు ప్రమోట్ చేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు తరలించట్లేదు, వట్టి అపోహ మాత్రమే అని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో చెప్పడం గమనార్హం. దీంతో వైజాగ్ రాజధాని పనులు ఆపేశారా? ఇటీవల కేంద్రం అమరావతి రాజధాని అని చెప్పడంతో ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోందా? మరో నాలుగు నెలల్లో ఎన్నికలు ఉండటంతో ఇప్పుడు తరలింపు ఎందుకు అనుకుందా తెలియాలి. ఇన్నాళ్లు మూడు రాజధానులు, విశాఖ పరిపాలన రాజధాని అని చెప్పి ఇప్పుడు వైజాగ్ కి కార్యాలయాలు తరలించట్లేదు అని చెప్పడం గమనార్హం. మరి వైజాగ్ రుషికొండ మీద కట్టే కట్టడాలు ఏంటో వాటి గురించి ప్రభుత్వానికే తెలియాలి.

  Last Updated: 12 Dec 2023, 09:53 PM IST