AP Fiber Net : ఏపీ ప్రభుత్వం ఫైబర్ నెట్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 500 మంది ఉద్యోగులను ఫైబర్ నెట్లో సర్కార్ తొలగించింది. ఇక ముందు ఎటువంటి పొడిగింపు ఉండబోదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. సూర్య ఎంటర్ప్రైజెస్ ద్వారా నియమించిన వారందరు కూడా ఈ నెలాఖరుకు ఫైబర్ నెట్ నుంచి ఔట్ అవనున్నారు. వైసీపీ నేతలు చెప్పిన వారినందరినీ గతంలో అప్పటి యాజమాన్యం ఫైబర్ నెట్లో చేర్చుకుంది.
Read Also: Minister Narayana : అమరావతిపై అపోహలు సృష్టించొద్దు: మంత్రి నారాయణ
అప్పటి టీడీపీ సర్కార్ అతి తక్కువ ధరకు కేబుల్, నెట్, ఫోన్ సేవలను అందించింది. తక్కువ ధరకే నెట్ రావడంతో ఏపీలో పెద్ద సంఖ్యలో కనెక్షన్లు తీసుకున్నారు ప్రజలు. అయితే టీడీపీ ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ ఫైబర్ నెట్ను అన్ని విధాలుగా నిర్వీర్యం చేశారని చెప్పుకోవచ్చు. అవినీతి, అక్రమాలతో ఏపీ ఫైబర్ నెట్ పాతాళంలోకి నెట్టేసింది గత వైసీపీ ప్రభుత్వం. ఏపీ ఫైబర్ నెట్ అంతా అప్పులమయంగా మారిపోయింది. ఈ ఉద్యోగులంతా కూడా ఫైబర్ నెట్ కార్యాలయానికి రాకుండా జీతాలు తీసుకున్న పరిస్థితి. దీనిపై దృష్టిసారించిన కూటమి ప్రభుత్వం దాదాపు 500 మందిని ఫైబర్ నెట్ నుంచి తొలగించింది.
ఇక, వైసీపీ హయాంలో పెద్దల అండదండలతో అనేక మంది ఫైబర్ నెట్లో జాయిన్ అయి తమ ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడ్డారు. ఇప్పటికీ కూడా వారే ఇంకా ఉండటంతో పాటు సిబ్బంది కూడా వారే ఉండటంతో విమర్శలు వెల్లువెత్తాయి. పీకల్లోతు అప్పులో కూరుకుపోవడంతో పాటు కనెక్షన్లు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో ఇందులో జరిగిన అక్రమాలను బయటపెట్టేందుకు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.5400 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరుగగా.. దాదాపు రూ.500 కోట్లు అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో నియమితులైన వారందరినీ పూర్తిగా ఉద్యోగాల నుంచి తొలగించాలని సర్కార్ నిర్ణయించింది. అందులో భాగంగా ఏపీ ఫైబర్ నెట్లో దాదాపు 500 మంది ఉద్యోగాలను తొలగించింది సర్కార్.