DSC Hall Tickets : అభ్యర్థులు ప్రిపేరయ్యేందుకు వీలుగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)కు, డీఎస్సీ-2024కు మధ్య 4 వారాల గడువు ఉండాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ షెడ్యూలును మార్చారు. కొత్త షెడ్యూలు ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకూ రోజుకు రెండు విడతలుగా సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ), పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ప్రిన్సిపల్ పోస్టులకు ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకూ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, వ్యాయామ డైరెక్టర్, ప్రిన్సిపల్ పోస్టులకు పరీక్షలు ఉంటాయి. మార్చి 20 నుంచి పరీక్ష కేంద్రాల ఎంపికకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఈనెల 25 నుంచి హాల్టికెట్ల (DSC Hall Tickets) డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతకుముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమైతే మార్చి 15 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో షెడ్యూలును పూర్తిగా మార్చేశారు.
We’re now on WhatsApp. Click to Join
హైకోర్టులో పిటిషన్ వేస్తే..
టెట్ పరీక్ష ఫలితాలు మార్చ్ 14న వస్తున్నాయని, మార్చి 15 నుంచి డీఎస్సీ పరీక్షలు పెట్టడంపై హైకోర్టులో పలువురు విద్యార్థులు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై జవ్వాజి శరత్ చంద్ర వాదనలు వినిపించారు. ఒక్క రోజు సమయంలో విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతారని శరత్ చంద్ర ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎన్నడూ ఇలాంటి ఎగ్జామ్ షెడ్యూల్ ఇవ్వలేదని వాదనలు వినిపించారు. ఈ వాదనలను హైకోర్ట్ పరిగణలోకి తీసుకుంది. డీఎస్సీ షెడ్యూల్ ను సస్పెండ్ చేసింది. టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలకు మధ్య కనీసం నాలుగు వారాల గ్యాప్ ఉండాలని ఆదేశాలిచ్చింది.