CM Chandrababu Naidu: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. నక్సల్స్ ప్రభావం ఉన్న రాష్ట్రాలతో కేంద్ర హోం శాఖ నిర్వహించే సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు. సీఎం చంద్రబాబు సోమ, మంగళవారాల్లో ఢిల్లీలోనే ఉండనున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలవనున్నారు. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
అయితే మోదీతో భేటీలో కీలకంగా తిరుమల లడ్డూ వ్యవహారం, రాష్ట్ర అభివృద్ది విషయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మోదీ భేటీ అనంతరం రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ను కలవనున్నారు. మంగళవారం అమిత్ షా, నిర్మలా సీతారామన్తో భేటీ అనంతరం తిరిగి ఏపీకి చేరుకోనున్నారు.
Also Read: CM Revanth Reddy : గత ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసింది : సీఎం రేవంత్ రెడ్డి
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ..?
తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ జరిగే హోంమంత్రి సమావేశంలో వీరిద్దరూ పాల్గొంటారు. అనంతరం వీరిరువురూ భేటీ అవుతారని సమాచారం. ఇప్పటికే రేవంత్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం హస్తినకు వెళ్తారు. ఇద్దరు సీఎంల సమావేశంపై రెండు తెలుగు రాష్ట్రాలలో ఉత్కంఠ నెలకొని ఉంది.
చంద్రబాబుకు షర్మిల విజ్ఞప్తి
విశాఖ స్టీల్ప్లాంట్ వ్యవహారంపై సీఎం చంద్రబాబుకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కీలక విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి పయనమవుతున్న చంద్రబాబు గారు.. విశాఖ స్టీల్ పరిరక్షణపై మీరిచ్చిన హామీని మరోసారి గుర్తు చేస్తున్నాం. ప్రతిపక్ష నేతగా 2021లో మీరు సంతకం చేసి ఇచ్చిన లేఖను మళ్ళీ పంపుతున్నాం. ఇచ్చిన హామీపై మోదీ, అమిత్ షాలను నిలదీయండి అని ట్వీట్ చేశారు.