Site icon HashtagU Telugu

Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

Annadata Sukhibhava

Annadata Sukhibhava

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు శుభవార్త అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు ఫిబ్రవరిలో విడుదల కానున్నాయి. పత్తి కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులు రెండు, మూడు రోజుల్లో తొలగిపోతాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంతో పత్తి తేమ శాతంపై సానుకూల స్పందన వచ్చింది. తుఫాను ముప్పు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి సూచించారు.

ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు తీపికబురు చెప్పారు. అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు ఇటీవల విడుదల చేయగా.. తాజాగా మూడో విడత నిధుల విడుదలపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత లబ్ధిని ఫిబ్రవరిలో అందిస్తామని తెలిపారు. ఈ నెల 21న రెండో విడత కింద రూ.7వేలు చొప్పున విడుదల చేసిన సంగతి తెలిసిందే. మూడో విడతలో రూ.6వేలు రైతుల బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20వేలు జమ చేస్తోంది.. అందులో రూ.6వేలు కేంద్రం ఇస్తుండగా.. ఏపీ ప్రభుత్వం మరో 14 వేలు కలిపి మొత్తం రూ.20 వేలు ఇస్తోంది.

మరోవైపు పత్తి కొనుగోళ్లకు సంబంధించి సీసీఐ కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందుల్ని రెండు, మూడు రోజుల్లో పరిష్కరిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. మంత్రి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్నిసందర్శించి రైతులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పత్తి రైతుల సమస్యలపై కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. పత్తి తేమ శాతం 18 ఉన్నా కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరారని మంత్రి వివరించారు. డిసెంబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో పత్తి కొనుగోళ్లు జరిగేలా చూస్తామని.. కొనుగోలు కేంద్రాలను పెంచాలని కేంద్రాన్ని కోరగా సానుకూల స్పందన వచ్చిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని.. పత్తికి సరైన ధర రావాలంటే, నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా తేమ శాతం ఉండాల్సిన ఆవశ్యకతపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన పత్తిని శుభ్రం చేసి, దూదిని వేరుచేసే జిన్నింగ్ యంత్రాల పనితీరును, ప్రక్రియను వివరంగా తెలుసుకున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియలో ఎక్కడా రైతులకు నష్టం కలగకుండా పారదర్శకత పాటించాలని సూచించారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర తప్పనిసరిగా అందేలా ప్రభుత్వం తరపున పూర్తి భరోసా కల్పిస్తున్నామన్నారు. పత్తి కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, వెంటనే అధికారులను సంప్రదించి పరిష్కరించుకోవచ్చన్నారు.

తుఫాను హెచ్చరికలతో.. రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ద‌క్షిణ అండ‌మాన్ స‌ముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడ‌నం వాయుగుండంగా మారుతుందని.. రానున్న 48 గంట‌ల్లో తుఫాను తీవ్రత పెరిగే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని.. ముఖ్యంగా వరి కోతలు కోసిన రైతులు వెంటనే తమ పంటను/ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. రైతులు ధాన్యం కాపాడుకునేందుకు వీలుగా, ప్రభుత్వం తరపున ఉచితంగా పట్టలు పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లా యంత్రాంగం ద్వారా వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులకు జాగ్రత్తలు చెబుతారని.. దయచేసి వారి సూచనలను తప్పక పాటించాలన్నారు. సముద్రం అల‌జ‌డిగా మారుతున్నందున, మత్స్యకారులు వేట‌కు వెళ్లొద్దని సూచించారు. వేట‌కు వెళ్లిన వారు తక్షణమే వెనక్కు రావాలలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు, రైతాంగానికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు మంత్రి అచ్చెన్నాయుడు.

Exit mobile version