AP Hot : ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఇంకా మే నెల రాకముందే చాలా జిల్లాల్లో టెంపరేచర్స్ 45 డిగ్రీలకు చేరాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. ప్రత్యేకించి పిల్లలు, ముసలివారు చాలా ఇబ్బందిపడుతున్నారు. వాతావరణం హాట్గా ఉండటంతో.. మధ్యాహ్నం టైంలో ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు జనం జంకుతున్నారు. భానుడి నిప్పుల వర్షం, వడగాలుల ధాటి ఇప్పుడే ఇలా ఉంటే.. మే నెలలో పరిస్థితి ఏమిటని అంతటా చర్చించుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join
వామ్మో.. దంచికొడుతున్న ఎండలు
శనివారం రోజు ఆంధ్రప్రదేశ్లోని(AP Hot) 19 జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా టెంపరేచర్స్ నమోదయ్యాయి. ఇంకొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతల 44 డిగ్రీలు దాటాయి. అత్యధికంగా అనకాపల్లి జిల్లా రావికమతం, నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరు, పల్నాడు జిల్లా రావిపాడు, పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ, లేవిడి, ప్రకాశం జిల్లా తోకపల్లి, వైఎస్ఆర్ కడప జిల్లా బలపనూరు ప్రాంతాల్లో 44.9 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయి. కర్నూలు జిల్లా గూడూరులో 44.6, విజయనగరం జిల్లా రాజాంలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పలు జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. అనంతపురం, కర్నూలు, నందిగామ, కావలి, తుని, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు 4 నుంచి 6 డిగ్రీల మేర పెరగడం గమనార్హం.రాష్ట్రంలోని 127 ప్రాంతాల్లో తీవ్ర స్థాయి వడగాలులు, 237 మండలాల్లో సాధారణ స్థాయి వడగాలులు వీచాయి.
Also Read :Hirakud Express Accident : విశాఖ – అమృత్సర్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం.. ఏమైందంటే ?
నేటికి, రేపటికి అలర్ట్స్ ఇవీ..
ఇవాళ (ఆదివారం) ఏపీలోని 64 మండలాల్లో తీవ్ర స్థాయి , 222 మండలాల్లో సాధారణ స్థాయి వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సోమ, మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆదివారం విజయనగరం జిల్లాలోని 24 మండలాల్లో, శ్రీకాకుళం జిల్లాలోని 15 మండలాల్లో, పార్వతీపురం మన్యం జిల్లాలోని 11 మండలాల్లో, అనకాపల్లి జిల్లాలోని 7 మండలాల్లో, కాకినాడ జిల్లాలోని 4 మండలాల్లో, తూర్పుగోదావరి, విశాఖల్లోని ఒక్కో మండలంలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, బాపట్ల, ఏలూరు, గుంటూరు, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ వడగాలుల ప్రభావం ఉంటుందని ఐఎండీ పేర్కొంది.