AP Rajya Sabha : విజయసాయిరెడ్డి రాజీనామాతో ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం దక్కేది ఎవరికి ? ఆ స్థానం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యేది ఎవరు ? అనే ఉత్కంఠకు తెరపడింది. ఈ స్థానానికి సంబంధించిన నామినేషన్ గడువు రేపు (మంగళవారం) మధ్యాహ్నం 3 గంటల్లోగా ముగియనుంది. ఈ తరుణంలో బీజేపీ హైకమాండ్ కీలక ప్రకటన చేసింది. ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాకా వెంకటసత్యనారాయణ పేరును ప్రకటించింది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీని ఆయనతో భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది.
Also Read :Padma Bhushan : తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టులో పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలకృష్ణ
బీజేపీ ఏపీ కోర్ గ్రూప్ సమావేశంలో..
ఈరోజు బీజేపీ ఏపీ కోర్ గ్రూప్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఐరోపా దేశాల పర్యటనలో ఉన్న ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి.. అక్కడి నుంచే వర్చువల్గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాకా వెంకటసత్యనారాయణ వైపు బీజేపీ అధిష్ఠానం మొగ్గు చూపింది. పార్టీ కార్యకర్తగా అంకితభావంతో బీజేపీ కోసం పనిచేస్తున్నందుకే ఆయనకు రాజ్యసభ సీటును కేటాయించింది. బీజేపీ నుంచి ఈ రాజ్యసభ స్థానాన్ని ఆశించిన వారిలో తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నామలై, పార్టీ సీనియర్ నాయకురాలు స్మ్రుతి ఇరానీ ఉన్నారు.
Also Read :Terrorists Hunt : నలుగురు ఉగ్రవాదుల వేట.. లొకేషన్పై కీలక అప్డేట్
అందరినీ ఆశ్చర్యపర్చిన బీజేపీ
ఇక ఎస్సీ వర్గీకరణలో కీలక పాత్ర పోషించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(AP Rajya Sabha) పేరును ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్షాకు సిఫార్సు చేశారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ ముగ్గురికి కాకుండా.. పాకా వెంకటసత్యనారాయణకు రాజ్యసభ సీటును బీజేపీ కేటాయించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏపీలో పార్టీని బలోపేతం చేయాలనే పట్టుదలతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉన్నారు. ఈ వ్యూహంలో భాగంగానే ఏపీ స్థానిక నేతకు ఏపీ రాజ్యసభ సీటును కేటాయించినట్లు తెలుస్తోంది.