Site icon HashtagU Telugu

Telugu States : రైల్వే స్టేషన్ల రూపురేఖలు మార్చబోతున్న ‘అమృత్ స్టేషన్ పథకం’

Amrit Stations

Amrit Stations

కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ (Amrit stations) పథకం ద్వారా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి (Development of Railway Stations) చేస్తోంది. ఈ పథకం కింద ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 117 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తున్నారు. తెలంగాణలో 40, ఆంధ్రప్రదేశ్‌లో 73 స్టేషన్లకు ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఇందులో కొన్ని స్టేషన్లలో పనులు పూర్తయ్యాయి, మరికొన్నింటిలో కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తోంది.

Manchu Family Fight : కలెక్టర్ ముందే తండ్రి కొడుకుల ఘర్షణ

తెలంగాణ(Telangana)లో 40 స్టేషన్లకు అభివృద్ధి :

తెలంగాణలో అమృత్ స్టేషన్స్ పథకం కింద 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడానికి కేంద్రం రూ. 1,992 కోట్లు కేటాయించింది. ముఖ్యంగా సికింద్రాబాద్, హైదరాబాద్, వరంగల్, కాచిగూడ, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం, యాదాద్రి, మల్కాజిగిరి, గద్వాల్, మెదక్, భద్రాచలం రోడ్, హైటెక్ సిటీ, బేగంపేట వంటి ప్రధాన స్టేషన్లు ఇందులో ఉన్నాయి. సికింద్రాబాద్ స్టేషన్‌కు రూ. 715 కోట్లు, హైదరాబాద్ స్టేషన్‌కు రూ. 237 కోట్లు కేటాయించారు. ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించే విధంగా స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌(AP)లో 73 స్టేషన్ల అభివృద్ధి :

ఆంధ్రప్రదేశ్‌లో 73 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి రూ. 2,051 కోట్లు కేటాయించారు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, అనంతపురం, కడప, గుంటూరు, ఒంగోలు, శ్రీకాకుళం, పలాస, కాకినాడ, భీమవరం వంటి ముఖ్య స్టేషన్లు ఈ పథకంలో ఉన్నాయి. విశాఖపట్నం స్టేషన్‌కు రూ. 446 కోట్లు, తిరుపతికి రూ. 312 కోట్లు, రాజమండ్రికి రూ. 271.43 కోట్లు కేటాయించారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్టేషన్లను నూతన సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నారు.

Ambulances : ఏపీ ప్రభుత్వానికి సోనూసూద్‌ అంబులెన్స్‌లు..

అమృత్ భారత్ స్టేషన్స్ పథకం లక్ష్యాలు :

ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1,275 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. రైల్వే స్టేషన్లలో వేయిటింగ్ హాళ్లు, టాయిలెట్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఉచిత వైఫై, ప్రయాణికులకు సులభంగా రాకపోకలు జరిగే విధంగా మల్టీ మోడల్ కనెక్టివిటీ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. స్టేషన్ల చుట్టు ప్రహరీ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసి, నగర అనుసంధానాన్ని మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ పథకం ద్వారా రైల్వే ప్రయాణికులకు మెరుగైన అనుభవం కల్పించడంతో పాటు, రవాణా వ్యవస్థను మరింత సమర్థంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణతో తక్కువ సమయంలో ప్రయాణికులు రైళ్లను అందుకోవడానికి వీలుకలుగుతుంది. అమృత్ భారత్ స్టేషన్స్ పథకం రాష్ట్రాల్లో రైల్వే సేవలకు కొత్త రూపాన్ని తీసుకురానుంది.

Exit mobile version