Site icon HashtagU Telugu

Electricity Charges Hike : బాబు ష్యూరిటీ-బాదుడు గ్యారంటీ – అంబటి సెటైర్లు

Increase In Electricity Cha

Increase In Electricity Cha

ఏపీలో నేటి నుండి కరెంట్ చార్జీల పెరుగుదలపై వైసీపీ నేత , మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) తనదైన శైలి లో సెటైర్లు వేశారు. ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపునకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ERC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈరోజు డిసెంబరు 1 నుంచి ఒక యూనిట్‌ విద్యుత్‌కు 92 పైసలు చొప్పున ఛార్జీలు పెరగనున్నాయి. ఈ పెంపు 2026 నవంబర్ వరకు అమల్లో ఉంటుంది. ఈ నిర్ణయంతో ప్రతినెలా 200 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించే వారి కరెంటు బిల్లు అదనంగా రూ.184 మేర పెరుగుతుంది.

కరెంటు ఛార్జీల(Electricity Charges Hike) పెంపుతో ఏపీ ప్రజలపై రూ.7,912 కోట్ల మేర భారం పడనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.9,412 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీలను వసూలు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ విద్యుత్ రాయితీలకుగానూ రూ.9,412 కోట్లలో రూ.1,500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా,  దాదాపు రూ.7,912 కోట్లు ప్రజలపై భారం పడనుంది. ఈఆర్సీ అనుమతి మేరకు రూ.9,412 కోట్లలో డిస్కంలు ప్రతినెలా 40 పైసలు చొప్పున రూ.2,868.90 కోట్లను వినియోగదారుల నుంచి ఇప్పటికే వసూలు చేశాయి. మిగిలిన రూ.6,543.60 కోట్లను డిసెంబర్‌ 1 నుంచి 2026 నవంబర్‌ వరకూ వసూలు చేయాలని ఈఆర్సీ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇక విద్యుత్ ఛార్జీల పెంపుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘ఎన్నికల ముందు బాబు ష్యూరిటీ – భవిష్యత్ గ్యారంటీ.. ఎన్నికల తర్వాత బాబు ష్యూరిటీ-బాదుడు గ్యారంటీ’ అని రాసుకొచ్చారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపైనా ఆయన సెటైర్లు వేశారు. ‘ప్రతి వైన్ షాపునకూ బెల్ట్ ఉంది.. బాబుకే బెల్ట్ లేదు తీయడానికి!’ అని రాసుకొచ్చారు.

Read Also : Tritiya Jewellers : హీరోయిన్స్‌కే కుచ్చుటోపీ పెట్టిన మోసగాడు.. కటాకటాల వెనక్కి కాంతిదత్