Ram Gopal Varma: ఏపీ హైకోర్టు రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఇప్పటికే నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ మరో మూడు పిటిషన్లపై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఎక్స్ లో తాను చేసిన పోస్టులపై చట్టవిరుద్ధంగా కేసులు నమోదు చేస్తున్నారని.. ఈ పోస్టులపై కేసులు నమోదు చేయవద్దని ఆదేశించాలని రామ్ గోపాల్ వర్మ ఆ పిటిషన్ లో కోరారు. ఇప్పటివరకు నమోదైన కేసులను క్వాష్ చేయాలని కూడా ఆయన కోరారు. కాగా, రామ్ గోపాల్ వర్మ పై ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తుళ్లూరు, అనకాపల్లి జిల్లా రావికమతం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ పోలీస్ స్టేషన్లతో పాటు మరో ఆరు కేసులు కూడా ఆయనపై నమోదయ్యాయి. మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆయన కోసం పోలీసులు గాలించారు. అయితే తాను భయపడడం లేదంటూ నవంబర్ 27న ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
ఇకపోతే..చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై ఈ ఏడాది మార్చిలో వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని టీడీపీ, జనసేన కార్యకర్తలు రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ అయితే ఏడాది క్రితం తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు సంబంధించి సంబంధం లేని వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదులు చేశారని… దీనిపై కేసులు నమోదైన విషయాన్ని వర్మ చెబుతున్నారు.
Read Also: Lagacharla : హిమాలయాలకు తాకినా లగచర్ల బాధితుల ఆవేదన ..